కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) భావిస్తున్నారు. త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మరింత బలోపేతంగా పనిచేయాలన్న లక్ష్యంతో రేవంత్ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో రేపు వికారాబాద్లో కీలక శిక్షణ కార్యక్రమం నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఆదివారం మధ్యాహ్నం సీఎం వికారాబాద్కు చేరుకోనున్నారు. అక్కడి హరిత రిసార్ట్స్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేయడం, ప్రజా సమస్యలపై సమర్థవంతంగా స్పందించే విధానాలపై నేతలకు మార్గనిర్దేశం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా పార్టీ వర్గాలు తెలిపాయి.
ఈ శిక్షణ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రారంభించనున్నారు. పార్టీ నిర్మాణం, ఎన్నికల వ్యూహాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారం, సోషల్ మీడియా వినియోగం వంటి అంశాలపై నేతలకు అవగాహన కల్పించనున్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ శ్రేణులను సిద్ధం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సమాచారం.
ఈ సమావేశానికి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తోపాటు పలువురు మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు హాజరుకానున్నారు. రెండు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్న ఈ శిక్షణ శిబిరం కాంగ్రెస్ పార్టీకి సంస్థాగతంగా కీలకంగా మారనున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.


