కలం, వెబ్ డెస్క్: దేశ రాజధానిలో రోజురోజుకూ విపరీతంగా కాలుష్యం పెరిగిపోతుంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం కఠిన చర్యలకు దిగుతోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్లను బాగుచేయడం, ఎలక్ట్రానిక్ బస్సుల సంఖ్యను పెంచడం లాంటివి అమలుచేసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం (Delhi Govt) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కాలుష్య నియంత్రణలో భాగంగా 10 ఏళ్లు దాటిన డీజిల్ వాహనాలు, 15 ఏళ్లు దాటిన పెట్రోల్ వాహనాలను ‘ఎండ్-ఆఫ్-లైఫ్ వెహికల్స్’ (ELVs) గా ప్రకటించింది. ఈ కొత్త రూల్స్ ప్రకారం.. ఈ వాహనాలు రోడ్లపై తిరుగుతూ కనిపించినా లేదా బహిరంగ ప్రదేశాల్లో పార్క్ చేసినా రవాణా శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారు. ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండానే వాటిని స్వాధీనం చేసుకుని నేరుగా స్క్రాపింగ్ (తుక్కు) కేంద్రాలకు తరలిస్తారు.
పాత వాహనాలను తుక్కుగా మారకుండా కాపాడుకోవడానికి వాహనదారులకు అవకాశం కూడా కల్పించింది. వాహనం గడువు ముగియకముందే ఏడాదిలోపు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) తీసుకుని, ఇతర రాష్ట్రాలకు వాహనాన్ని బదిలీ చేసుకోవచ్చని తెలిపింది. అయితే, ఎన్వోసీ పొందిన ఒక నెల లోపు వాహనాన్ని ఢిల్లీ నుంచి బయటకు తీసుకెళ్లాల్సి ఉంటుంది, లేనిపక్షంలో మళ్ళీ స్వాధీనం చేసుకుంటుంది.
ప్రభుత్వం పాత వాహనాల కోసం మరొక ప్రత్యామ్నాయాన్ని కూడా సూచిస్తోంది. పాత పెట్రోల్, డీజిల్ కార్లను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుకోవడం ద్వారా వాటిని తిరిగి ఉపయోగించుకోవచ్చు. ఇందుకోసం ప్రభుత్వం నిర్ణీత రాయితీలను కూడా అందిస్తోంది. ఒకవేళ వాహనాన్ని స్క్రాపింగ్ చేస్తే, కొత్త వాహనం కొనుగోలుపై రోడ్డు పన్ను మినహాయింపు, రిజిస్ట్రేషన్ ఫీజు మాఫీ వంటి ప్రయోజనాలను పొందొచ్చు.
Read Also: ఫ్లయింగ్ కిస్ ఇస్తే జైలుకే.. ముంబై కోర్టు సంచలన తీర్పు
Follow Us On : WhatsApp


