కలం, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు కాలువలోకి దూసుకెళ్లడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులు మృతి చెందారు. మధురా (Mathura) జిల్లాలో బుధవారం అర్థరాత్రి ఈ ప్రమాదం జరిగింది. యువకులు కారులో మహావన్ నుంచి గోవర్ధన్ మార్గంలో డీగ్ వైపు వెళ్తున్నారు. ఒక ప్రమాదకరమైన మలుపు వద్ద కారు ఒక్కసారిగా అదుపు తప్పింది. ముందుగా రోడ్డుపక్కన ఉన్న సిమెంట్ ట్యాంకును ఢీకొట్టిన కారు, అక్కడి నుంచి సుమారు ఆరు మీటర్ల లోతైన కాలువలోకి పల్టీ కొట్టి పడిపోయింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారంతా 25 ఏళ్ల లోపు వారే కావడం బాధాకరం. మృతులను రాహుల్, అమిత్, మోహిత్, మరో వ్యక్తిగా గుర్తించారు. వీరు ఒక నిశ్చితార్థ వేడుకకు హాజరవడానికి వెళ్తున్నట్లు సమాచారం. మృతుల్లో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన సోదరులని పోలీసులు వెల్లడించారు.
ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే గ్రామస్తులు అక్కడికి చేరుకుని వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. అయితే కాలువలో నీరు ఎక్కువగా ఉండటంతో కారు పూర్తిగా మునిగిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ సహాయంతో కారును బయటకు తీశారు. కానీ అప్పటికే నలుగురూ ప్రాణాలు కోల్పోయారు. మలుపు వద్ద హెచ్చరిక బోర్డులు లేకపోవడంతోనే ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Read Also: భారత్లో ఓపెన్ ఏఐ కొత్త ఆఫీసులు.. ఎక్కడంటే..?
Follow Us On : WhatsApp


