కలం, సినిమా : ఈరోజుని (1978 ఫిబ్రవరి 11) మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తన సినీ జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజుగా గుర్తు చేసుకున్నారు. “పునాదిరాళ్లు”(Punadhirallu) సినిమా కోసం తొలిసారి కెమెరా ముందు నిలిచిన ఆ క్షణాన్ని స్మరించుకుంటూ ఎమోషనల్ పోస్టు చేశారు. ఆరోజు నాలో కలిగిన ఆత్రుత, ఆనందం, బాధ్యత, భావోద్వేగం మాటల్లో వర్ణించలేనిదని తెలిపారు. “ఆ క్షణం ఇప్పటికీ నిన్న, మొన్న జరిగినట్టే అనిపిస్తుంది. ఒక అందమైన చందమామ కథలా ఆ అనుభూతి నా హృదయంలో నిలిచిపోయింది” అని చిరంజీవి పేర్కొన్నారు.
సినిమా రంగంలో తనకు తొలి అవకాశం ఇచ్చిన “పునాదిరాళ్లు”(Punadhirallu) చిత్ర దర్శకుడు, నిర్మాతలకు చిరంజీవి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. వారి నమ్మకం, ప్రోత్సాహమే తన నటనా ప్రయాణానికి పునాది రాళ్లుగా మారాయని చెప్పారు. అలాగే, అప్పటి నుంచి ఈరోజు వరకూ తనను ఆదరిస్తూ, ఆశీర్వదిస్తూ వచ్చిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. “మీ ప్రేమే నాకు బలం” అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు.


