కలం, డెస్క్ : బీహార్ లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. సమస్తిపూర్ జిల్లాలో పోలీస్ రిక్రూట్ మెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న యువకుడిని కిడ్నాప్ చేసి.. మత్తు మందు ఇచ్చి పెళ్లి (Bihar Marriage) చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యువకుడి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. జిల్లాలోని పాటోరీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న చక్రాజ్ అలీ గ్రామంలో ఈ ఘటన జరిగింది. జోడి పోఖర్ కు చెందిన నితీష్ కుమార్ హోం గార్డు జాబ్ కు ప్రిపేర్ అవుతున్నాడు. నితీష్ ఇంటి నుంచి బయటకు వెళ్తున్న టైమ్ లో.. కుందన్ రాజవంశీ, రాహుల్ అనే ఇద్దరు స్నేహితులు మాయమాటలు చెప్పి బయటకు తీసుకెళ్లారు.
ఆ తర్వాత కూల్ డ్రింక్ లో మత్తు మందు ఇచ్చి ఓ అమ్మాయితో పెళ్లి జరిపించారు. పెళ్లి (Bihar Marriage) టైమ్ లో నితీష్ మత్తులోనే ఉన్నాడని.. వరమాల కూడా సరిగ్గా వేయలేకపోతున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇదే విషయంపై నితీష్ స్పందించాడు. తనకు స్పృహలోకి వచ్చే సమయానికే పెళ్లి జరుగుతోందని.. తనను ఒకచోట బంధించి పదే పదే మత్తు మందు ఇచ్చారని ఆరోపించాడు. ఈ ఘటనపై ఇరు కుటుంబాల వాదన భిన్నంగా ఉంది.
నితీష్ తాత మాట్లాడుతూ పెళ్లి గురించి గతంలో చర్చలు జరిగినప్పటికీ.. అమ్మాయి నచ్చకపోవడంతో తమ కుటుంబం తిరస్కరించినట్టు తెలిపారు. ఆ కక్షతోనే నితీష్ స్నేహితులు ఇలా బలవంతంగా పెళ్లి జరిపించినట్టు చెప్పాడు. అమ్మాయి సోదరుడు జై కుమార్ మాత్రం.. ఇరువురి సమ్మతితోనే పెళ్లి జరిగిందని తెలిపాడు. అమ్మాయి నితీష్ కుటుంబానికి ఎప్పటి నుంచో తెలుసని.. ఆరు నెలలుగా మాట్లాడుకుంటున్నారని చెప్పాడు. కాగా ఈ పెళ్లిపై నితీష్ తల్లి ఫిర్యాదు చేయగా.. పోలీసులు విచారణ ప్రారంభించారు.


