epaper
Wednesday, February 18, 2026
epaper

బంగ్లాదేశ్​లో హిందువులపై దాడులు.. ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ కీలక వ్యాఖ్యలు

కలం, వెబ్​డెస్క్​: బంగ్లాదేశ్​లో (Bangladesh) కొన్ని నెలలుగా హిందువులపై జరుగుతున్న దాడులు, హత్యాకాండపై ఆర్​ఎస్​ఎస్​ చీఫ్ మోహన్​ భగవత్ (Mohan Bhagwat)​ స్పందించారు. ఆ దేశానికి పరోక్షంగా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ​బంగ్లాదేశ్​లోని హిందువులు తమపై జరుగుతున్న హింసాకాండకు వ్యతిరేకంగా ఎదురుతిరగాలని నిర్ణయించుకుంటే, మొత్తం ప్రపంచంలోని హిందువులందరూ వాళ్లకు అండగా ఉంటారని వ్యాఖ్యానించారు. ఆర్​ఎస్​ఎస్​ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ముంబైలోని నెహ్రూ సెంటర్​ ఆడిటోరియంలో జరుగుతున్న ‘వ్యాఖ్యన్మాల’ ఉపన్యాస కార్యక్రమంలో రెండో రోజూ మోహన్​ భగవత్​ హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ఆర్​ఎస్​ఎస్​ దృక్పథాన్ని, పనితీరును వెల్లడించారు.

బంగ్లాదేశ్​లో సంక్షోభం కారణంగా 2023లో అప్పటి ప్రధాని షేక్​ హసీనా భారత్​లో తలదాచుకోవడం, అనంతరం విద్యార్థి ఉద్యమనేత ఉస్మాన్​ హాదీ హత్యతో భారత వ్యతిరేక అల్లర్లు చెలరేగడం తెలిసిందే. ఆందోళనకారులు హిందువులను లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడుతూ, హత్యలకు పాల్పడుతుండడంపై మోహన్​ భగవత్​ స్పందిస్తూ.. ‘బంగ్లాదేశ్​లో దాదాపు 1.25 కోట్ల మంది హిందువులు ఉన్నారు. తమ హక్కుల కోసం ప్రతిఘటించాలని వాళ్లు అనుకుంటే, ప్రపంచంలోని హిందువులంతా వాళ్లకు సహాయంగా నిలబడతారు’ అని స్పష్టం చేశారు.

విచ్ఛిన్నం చేయాలనుకుంటే..

దేశంలో జనాభాలోని అసమతుల్యతకు కారణం గత ప్రభుత్వాల నిర్వాకమని మోహన్​ భగవత్​ (Mohan Bhagwat) వ్యాఖ్యానించారు. ‘గతంలో ప్రభుత్వాలు జనాభా మార్పుల విషయంలో ఏమీ చేయలేదు. ముఖ్యంగా జననాలు, అక్రమ చొరబాట్లను పట్టించుకోలేదు. ప్రస్తుత ప్రభుత్వం వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇది విజయవంతం అవుతుంది’ అని ఆయన అన్నారు. భారత్​ను ఎవరూ విచ్ఛిన్నం చేయలేరని, ఎవరైనా ఆ దిశగా ప్రయత్నిస్తే వాళ్లే విచ్ఛిన్నమైపోతారని భగవత్​ హెచ్చరించారు.

కార్యకర్తలే నిధి..

ఆర్​ఎస్​ఎస్​కు నిధుల విషయంలో ఎదురవుతున్న ప్రశ్నల గురించి మాట్లాడుతూ.. రాష్ట్రీయ స్వయం సేవక్​ సంఘ్​ కార్పొరేట్​ లేదా సంస్థాగత ఆదాయం ఆధారపడి పనిచేయడం లేదని స్పష్టం చేశారు. ‘ఆర్​ఎస్​ఎస్​కు ఫండింగ్​ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ప్రజల్లో ఉంటుంది. దాని గురించి ఏం చెబుతున్నానంటే.. మా​కు కార్యకర్తల సాయం రూపంలోనే ఫండ్స్​ వస్తాయి. మేం, ఎక్కడికైనా వెళ్లినప్పుడు మాకు ఆతిథ్యం ఇచ్చేది వాళ్లే. హోటల్స్​లో కాకుండా కార్యకర్తల ఇళ్లలోనే బస చేస్తాం. మేం ఆహారం అడుగుతాం. కానీ, ఆహారం కోసం డబ్బు అడగం’ అని ఆయన తెలిపారు.

కులం అడ్డు కాదు..

ఆర్​ఎస్​ఎస్​ నాయకత్వ బాధ్యతలకు కులం ప్రామాణికం కాదని మోహన్​ భగవత్​ స్పష్టం చేశారు. అలాంటి వివక్షను ఆర్​ఎస్​ఎస్​ ప్రోత్సహించదన్నారు. ‘ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ కావడానికి బ్రాహ్మణులకు మాత్రమే అర్హత ఉంది.. ఎస్సీ, ఎస్టీలకు అర్హత లేదు అనేది అబద్దం. ఏ కులానికి సంబంధించిన వ్యక్తి అయినా సరే ఆర్​ఎస్​ఎస్​ అధ్యక్షుడు కావచ్చు. సంస్థ​ ప్రస్థానం బ్రాహ్మణులతో మొదలైనప్పటికీ అన్ని కులాల కోసమూ పనిచేస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు.

అందుకే ముస్లిం ఏరియాల్లో…

ముస్లింల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఘర్షణలు పెరగకుండా ఉండడం కోసమే ఆర్​ఎస్​ఎస్​ అక్కడ పనిచేయడం లేదని మోహన్​ భగవత్​ అన్నారు. ‘ముస్లిం ప్రభావిత ప్రాంతాల్లో సవాళ్లను ఎదుర్కోవడమంటే వాటిపై స్పందించకపోవడమే. వాళ్లు పరుషపదాలు వాడినా మేం స్పందించం. కారణం.. ఘర్షణలు మరింత పెద్దవి కాకుండా చూడాలనే ప్రయత్నం’ అని ఆయన అన్నారు.

Read Also: భవిష్యత్ లో 35 ట్రిలియన్ డాలర్ల వ్యవస్థగా భారత్ : పీయూష్ గోయల్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>