కలం, వెబ్ డెస్క్: చెన్నైలో నటి మంచు లక్ష్మి(Lakshmi Manchu)కి చేదు అనుభవం ఎదురైంది. ఓ మూవీ ప్రమోషన్లో భాగంగా చెన్నై(Chennai)కి వెళ్లిన మంచు లక్ష్మి ఓ హోటల్లో చేరారు. అయితే ఆమె కెమెరాను హోటల్ నిర్వాహకులు లోపలికి అనుమతించలేదు. ఎక్స్ వేదికగా మంచు లక్ష్మి ఈ విషయాన్ని వెల్లడించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చెన్నైలోని గ్రీన్ పార్క్ హోటల్స్(Green Park Hotel)లో చిన్న కెమెరాను కూడా అనుమతించలేదని మంచు లక్ష్మి ఆరోపించారు. దీనిపై రాతపూర్వకంగా తనకు ఎలాంటి నిబంధనలు చూపించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సరైన విధానం కాదన్నారు.
హోటల్ సిబ్బంది కూడా తనతో రూడ్గా ప్రవర్తించారని, తాను చాలా నిరాశకు గురయ్యానని మంచు లక్ష్మి చెప్పారు. ఆమెతో వచ్చిన కెమెరామెన్ను లోపలికి అనుమతించలేదని, అలాగే కెమెరా సామగ్రి విషయంలో కూడా సిబ్బంది చాలా నిబంధనలు ఉన్నాయని మాట్లాడారని ఆమె ఆరోపించారు. ఇంతకుముందు ఎన్నో సార్లు ఇదే హోటల్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఉన్నానని, కానీ ఈసారి మాత్రం సిబ్బంది ప్రవర్తన చాలా నిరాశ కలిగించిందని మంచు లక్ష్మి అన్నారు. హోటల్లో ముందుగా చెప్పని, అర్థం లేని నిబంధనలు పెట్టి ఇబ్బంది పెట్టారని ఆమె మండిపడ్డారు. ఇలాంటి పెద్ద హోటల్లో ఇలాంటి అనుభవం ఎదురవడం ఆశ్చర్యంగా ఉందని, హోటల్ మేనేజ్మెంట్తో పాటు జనరల్ మేనేజర్ ఈ విషయంపై స్పందించాలని మంచు లక్ష్మి డిమాండ్ చేశారు. తనలాంటి వాళ్లకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.


