కలం, వెబ్ డెస్క్: ఏపీ రాజకీయాలు తిరుమల లడ్డూ(Tirumala Laddu) చుట్టూనే తిరుగుతున్నాయి. కూటమి నేతలు, వైసీపీ నాయకులు పరస్పర ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు. తాజాగా జనసేన నాయకుడు నాగబాబు(Nagababu) తిరుమల కల్తీ నెయ్యి అంశంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో టీటీడీ చైర్మన్ నియామకంపై ప్రశ్నలు సంధించారు. నాస్తికుడు అయ్యుండి, ర్యాడికల్ స్టూడెంట్ యూనియన్లో పని చేసి బూతు సుప్రభాతాలు రాసి హిందూ దేవుళ్లను అవమానించిన భూమన కరుణాకర్ రెడ్డి(Bhumana Karunakar Reddy)ని టీటీడీ చైర్మన్గా వైఎస్ఆర్ ఎలా నియమించాడని ప్రశ్నించారు. దీన్ని హిందువులు ఎంతో వ్యతిరేకించారన్నారు. వైఎస్ జగన్ దాన్ని కొనసాగిస్తూ మళ్లీ ఆయనకు టీటీడీ చైర్మన్ పదవి కట్టబెట్టాడన్నారు. ఒక్కసారి ఆ పదవి ఇస్తేనే హిందువులు ఎంతో బాధపడ్డారని, అయినా మళ్లీ జగన్ ఆయనకే ఎందుకు పదవి ఇచ్చారని ప్రశ్నించారు. హిందువులను మళ్లీ బాధపెట్టేందుకే ఇలా చేశారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్, జగన్ వంశపారపర్యంగా క్రైస్తవులని, వాళ్ల నమ్మకాలను గౌరవిస్తామని చెప్పారు. అయితే వాళ్ల మత సంస్థలకు ఒక నాస్తికుడిని, దైవ దూషణ చేసే వాడిని చైర్మన్గా పెట్టి, మత సంస్థ డబ్బు, ఇతర నిర్ణయాలు అప్పజెప్తారా అని ప్రశ్నించారు. మరి టీటీడీ విషయంలో ఎందుకు అలా చేశారన్నారు. ఈ నిర్ణయాల కారణంగానే నేడు టీటీడీ లడ్డూ ప్రసాదంలోకి రసాయనాలు వచ్చి చేరాయన్నారు.


