కలం, వెబ్ డెస్క్: కడప జిల్లాలోని ప్రొద్దుటూరు (Proddatur)లో ఉన్న వారాహి అమ్మవారి ఆలయాన్ని (Varahi Temple) అటవీ అధికారులు కూల్చివేశారు. ఆలయంతో పాటు విగ్రహాలను ధ్వంసం చేశారు. దీంతో స్థానికులు, హిందూ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారాహి అమ్మవారి ఆలయం కూల్చివేతపై అధికారులను నిలదీస్తామని హెచ్చరిస్తున్నారు. దీనిపై భారీ ఎత్తున నిరసనలు చేస్తామని హిందూ సంఘాల నాయకులు తెలిపారు. విగ్రహాలు కూల్చిన అటవీ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆలయంలో నవగ్రహాలు, కొత్తగా నిర్మిస్తున్న మండపం కూల్చివేతపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆలయాన్ని తక్షణమే పునర్నిర్మించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఆలయాన్ని వెంటనే నిర్మించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని స్థానికులు హెచ్చరించారు. ఈ విషయం తీవ్ర వివాదాస్పదం కావడంతో తహసీల్దార్ ఆలయ పరిసరాలను పరిశీలించారు. అయితే, ఈ గుడి ఉన్న ప్రాంతం అటవీ శాఖ పరిధిలోనే ఉంది. సమీపంలో రెండు మూడు ఆలయాలు ఉన్నాయి. అధికారులు కేవలం వారాహి అమ్మవారి ఆలయాన్ని మాత్రమే ఎందుకు కూల్చివేశారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అలాగే ఆలయం, విగ్రహాల తొలగింపు చేపట్టిన తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కనీసం విగ్రహాలను తీసి పక్కన పెట్టలేదని మండిపడుతున్నారు.


