కలం, వెబ్డెస్క్: అమెరికాతో ట్రేడ్ డీల్ విషయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాజీ పడ్డారని లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు. భారత్పై విధించిన టారిఫ్స్ను 25శాతం నుంచి 18శాతానికి తగ్గిస్తూ సోమవారం రాత్రి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై మంగళవారం పార్లమెంట్ ఆవరణలో రాహుల్ గాంధీ మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
‘కొన్ని నెలలుగా నిలిచిపోయిన ట్రేడ్ డీల్ హఠాత్తుగా రాత్రికి రాత్రే కుదిరింది. ప్రధాని మోదీపై తీవ్రమైన ఒత్తిడి ఉంది. ఆయన కంగారు పడ్డారు. ఎందుకంటే ఇప్పటివరకు ఆయనకు ఒక ఇమేజ్ను ఆపాదించారు. ఇప్పుడు దాన్ని బద్దలు కొడుతున్నారు. కారణం.. అమెరికాలో అదానీపై ఒక కేసు ఉంది. నిజానికి అది మోదీజీపైనా ఉంది. అలాగే ఎప్స్టీన్ ఫైల్స్లో అమెరికా విడుదల చేయని చాలా విషయాలు ఉన్నాయి. ఈ రెండిటి వల్లే మోదీజీపై తీవ్ర ఒత్తిడి ఉంది. ఆ ఒత్తిడిలోనే రాజీపడ్డారు. ఒప్పందం కుదుర్చుకొని, దేశాన్ని, రైతుల కష్టాన్ని తాకట్టు పెట్టారు’ అని రాహుల్ (Rahul Gandhi) అన్నారు.
కాగా, అంతకుముందు లోక్సభలో రెండో రోజూ ఆర్మీ మాజీ చీఫ్ నరవణే జ్ఞాపకాల ఆత్మకథలోని పుస్తకంలోనివిగా చెబుతున్న మాటలపై గందరగోళం చెలరేగింది. రాష్ట్రపతికి ధన్యవాద తీర్మానం సమయంలో రాహుల్ మరోసారి నరవణే మాటలున్న మ్యాగజైన్ను ప్రదర్శిస్తూ, ఆ అంశంలపై మాట్లాడేందుకు ప్రయత్నించారు. దీంతో అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల దాడి కొనసాగడంతో సభ వాయిదా పడింది. ఈ అంశంపైనా పార్లమెంట్ ఆవరణలో రాహుల్ మాట్లాడారు. రాష్ట్రపతికి ధన్యవాద తీర్మానం తెలిపే విషయంలో ప్రతిపక్ష నేతను మాట్లాడనివ్వకపోవడం పార్లమెంట్ చరిత్రలోనే మొదటిసారని రాహుల్ వ్యాఖ్యానించారు.
Read Also: పార్లమెంట్ లో విపక్ష ఎంపీల సస్పెన్షన్..
Follow Us On: Youtube


