కలం, డెస్క్ : కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్ (Jogi Ramesh) ఇంటిమీద టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. మంత్రి లోకేష్ మీద జోగి రమేశ్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పెద్ద ఎత్తున కార్యకర్తలు జోగి రమేశ్ ఇంటిని ముట్టడించారు. ఈ క్రమంలోనే కొందరు నిప్పుపెట్టడంతో పరిస్థితి రణరంగంలా మారింది. నిప్పు పెట్టిన సమయంలో జోగి రమేశ్ ఇంట్లో లేరు. కానీ జోగి రమేశ్ భార్య, ఆయన తండ్రి ఇంట్లోనే ఉన్నారు. అగ్ని కీలలు పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నాయి. జోగి రమేశ్ ఇల్లు మొత్తం పొగ వ్యాపించేసింది. టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున జోగి రమేశ్ ఇంటి వద్ద నినాదాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నాయి.
ఏం తప్పు చేశాను..
తన ఇంటికి నిప్పు పెట్టడంపై జోగి రమేశ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఏం తప్పు చేశానని తన ఇంటికి నిప్పు పెట్టారంటూ మండిపడ్డారు. ‘లోకేష్ నా మీద కుట్రలు చేస్తున్నారు. నా ఇంటిపై దాడులు చేస్తావా.. పెట్రోల్ బాంబులు వేస్తావా.. లోకేష్ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో.. నా ఇంటికి లోకేష్ ఇల్లు కూడా అంతే దూరం. నేను దాడులకు భయపడే వ్యక్తిని కాదు. గంజాయి బ్యాచ్ ను నా ఇంటికి పంపారు. అంబటి రాంబాబు (Ambati Rambabu) ఇంటి మీద దాడిని మర్చిపోక ముందే నా ఇంటి మీద దాడులు చేయించారు. వైసీపీ నేతల ఇండ్ల మీద దాడులు చేసి ఏం సాధిస్తారు. దాడులు చేస్తున్నా పోలీసులు చూస్తూ నిల్చున్నారు. ఎప్పుడూ మీరే అధికారంలో ఉంటారని అనుకోకండి. ‘ అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు జోగి రమేశ్ (Jogi Ramesh).
Read Also: కేంద్ర బడ్జెట్పై ఏపీ సీఎం కీలక వ్యాఖ్యలు
Follow Us On: Sharechat


