కలం, వెబ్ డెస్క్: క్రొయేషియా రాజధాని జాగ్రెబ్లోని భారత రాయబార కార్యాలయం(Indian Embassy) దాడి జరిగింది. ఖలిస్తాన్ వేర్పాటువాద సంస్థ ‘సిక్స్ ఫర్ జస్టిస్’ (SFJ) సభ్యులు కార్యాలయంలోకి అక్రమంగా ప్రవేశించి విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖలిస్తాన్(Khalistan) వేర్పాటువాదులు భారత జాతీయ జెండాను తొలగించి ‘ఖలిస్తాన్ జెండా’ను ఎగురవేయడానికి ప్రయత్నించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) వెల్లడించింది.
వియన్నా కన్వెన్షన్ ప్రకారం రాయబార కార్యాలయాలు పూర్తిగా రక్షణలో ఉండాలని, వాటిని అపవిత్రం చేయరాదని విదేశాంగ మంత్రిత్వ శాఖ గుర్తు చేసింది. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని క్రొయేషియా అధికారులను కోరింది. రిపబ్లిక్ డే సమీపిస్తున్న వేళ భారత్ను లక్ష్యంగా చేసుకొని ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. రాయబార కార్యాలయం వద్ద భారత్కు వ్యతిరేకంగా నినాదాలు చేసినట్టు సమాచారం. సాధారణంగా అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో కార్యకలాపాలు నిర్వహించే ఖలిస్తాన్ వేర్పాటువాదులు ఈసారి యూరోపియన్ యూనియన్ సభ్యదేశమైన క్రొయేషియాలో దాడికి ప్రయత్నించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవలి కాలంలో భారత్–క్రొయేషియా సంబంధాలు బలపడుతున్నాయి. గతేడాది కెనడాలో జరిగిన జీ7 సదస్సు అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ క్రొయేషియా(Croatia)ను సందర్శించారు. ఈ నేపథ్యంలో జాగ్రెబ్(Zagreb) ఘటనపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.


