కలం, వెబ్డెస్క్: పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాటలతో తాను ఇబ్బంది పడినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump – Shehbaz) వ్యాఖ్యానించారు. దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమ్మిట్లో గురువారం ట్రంప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాజా శాంతి కోసం రూపొందించిన 20 అంశాల ప్రణాళికను, గాజా శాంతి మండలి చార్ట్ (Gaza Board of Peace) ను ఆవిష్కరించారు. అనంతరం ట్రంప్ మాట్లాడారు. తన రెండో పదవీ కాలంలో ఇప్పటివరకు ఎనిమిది యుద్ధాలను ఆపినట్లు మళ్లీ చెప్పుకొచ్చారు. అందులో పాకిస్థాన్, భారత్ యుద్ధం కూడా ఉందన్నారు.
‘ఎనిమిది యుద్ధాలను, సంఘర్షణలను ఆపేశా. కొన్నింటి గురించి నాకు కూడా ముందు తెలియదు. భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం ఆపినందుకు చాలా సంతోషించా. అణు శక్తి కలిగిన రెండు దేశాల మధ్య యుద్ధం ఆపకపోతే పరిస్థితి తీవ్రంగా ఉండేది. ఈ యుద్ధం ఆపడం ద్వారా 10 నుంచి 20 మిలియన్ల మంది ప్రాణాలు కాపాడానని పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ పొగిడారు. ఆ వ్యాఖ్యలతో ఇబ్బంది పడ్డా. కానీ, ఆ తర్వాత ఆయన అలా చెప్పడం నాకు ఎంతో గౌరవంగా అనిపించింది’ అని ట్రంప్ (Trump – Shehbaz) అన్నారు.
గత ఏడాది భారత్లోని పహల్గామ్లో ఉగ్రదాడి అనంతరం భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తడం తెలిసిందే. ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోవడంతో భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ చేపట్టింది. పాకిస్థాన్లోని చాలా చోట్ల ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ క్రమంలో భారత్, పాక్ మధ్య నాలుగు రోజుల పాటు స్వల్ప యుద్ధం జరిగింది. ఈ యుద్ధాన్ని తానే ఆపినట్లు ఇప్పటికే చాలాసార్లు ప్రకటించుకున్న ట్రంప్ దావోస్ వేదికగా మరోసారి అదే పాట పాడారు.
శాంతి మండలిలో పాక్:
అమెరికా ఆధ్వర్యంలో రూపొందించిన గాజా శాంతి మండలిలో పాక్ సభ్య దేశంగా చేరింది. ఇందులో ఇప్పటివరకు 19 దేశాలు సభ్యులుగా చేరాయి. ఇందులో చేరాలని ట్రంప్ ఆహ్వానించినప్పటికీ భారత్ అంగీకారం తెలపలేదు. రష్యా, చైనా సైతం సమ్మతించలేదు. ఈ శాంతి మండలి కేవలం గాజా పునర్మిర్మాణం మాత్రమే కాకుండా ప్రపంచంలోని మిగిలిన సమస్యలపైనా దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. ‘గాజాతో సహా అనేక అంశాల్లో ఐక్యరాజ్యసమితి విఫలమైంది. గాజా శాంతి మండలి అన్నింటినీ పరిష్కరిస్తుంది’ అని ట్రంప్ వ్యాఖ్యానించడం దీనికి సంకేతంగా భావిస్తున్నారు.
కాగా, గాజా శాంతి మండలిలో పాకిస్థాన్ చేరడంపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు చెలరేగిపోతున్నారు. దేశంగా అవతరించినప్పటి నుంచి ఉగ్రవాదానికి పుట్టినిల్లుగా ఉన్న పాక్ను శాంతి మండలిలో చేర్చుకోవడంపై జోకులు పేలుస్తున్నారు. అంతేకాదు, శాంతి మండలిలో చేరే ప్రతి దేశం 1 బిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే అప్పులతో, ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతూ ప్రపంచ బ్యాంకు, గల్ఫ్ కంట్రీస్, చైనా వద్ద అప్పు తీసుకుంటున్న పాకిస్థాన్.. ఆ సొమ్ము ఎలా చెల్లిస్తుందంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
Read Also: ఆస్ట్రేలియాలో కాల్పులు.. ముగ్గురి మృతి..
Follow Us On: Sharechat


