కలం/ఖమ్మం బ్యూరో : రైతులు ఆధునిక పంటలతో అధిక లాభాలు పొందాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Thummala Nageswara Rao) అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట వ్యవసాయ కాలేజీలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొని వ్యవసాయ యాంత్రీకరణ, ప్రకృతి వ్యవసాయ పథకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ అశ్వరావుపేట కళాశాల అభివృద్ధికి రూ.8 కోట్లు మంజూరు చేసి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. కొత్తగూడెం జిల్లాలో అన్ని రకాల పంటలు పండించే సామర్థ్యం ఉన్న రైతులు ఉన్నారని ప్రశంసించారు.
ఆయిల్పామ్ సాగులో కోకో, మిరియాలు, జాజి వంటి అనుబంధ పంటలను కూడా రైతులు విజయవంతంగా సాగు చేస్తున్నారని తెలిపారు. ఆధునిక పంటలను సాగు చేసి ఈ జిల్లా తెలంగాణకే కాకుండా దేశానికి ఆదర్శంగా నిలవాలన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు. రాబోయే నాలుగేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల ఎకరాల్లో పామ్ ఆయిల్ సాగు లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. చిన్న, సన్నకారు, గిరిజన, బీసీ రైతుల అభ్యున్నతి కోసం సీఎం చొరవతో 50 శాతం సబ్సిడీతో వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. 2047 నాటికి వ్యవసాయ రంగం ద్వారా 400 బిలియన్ డాలర్ల ఆదాయం సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తుమ్మల వివరించారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ యాంత్రీకరణ, ప్రకృతి వ్యవసాయం రెండూ రైతులకు అత్యంత ఉపయోగకరమైన పథకాలన్నారు. గతంలో నిలిచిపోయిన యాంత్రీకరణ పథకాలను పునఃప్రారంభించి 50 శాతం సబ్సిడీతో రైతులకు యంత్ర పరికరాలు అందించడం శుభపరిణామమన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.31 లక్షల మంది రైతులకు రూ.101 కోట్ల వ్యయంతో వ్యవసాయ పరికరాలు అందించనున్నట్లు తెలిపారు. ప్రకృతి వ్యవసాయంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, రసాయన ఎరువుల అధిక వినియోగం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో నేచురల్, ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వరి ఉత్పత్తిలో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని, ఈ సీజన్లో 148 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి జరిగిందన్నారు. వరి కొనుగోలులో 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడంతో పాటు బోనస్ కూడా అందజేస్తున్నామని మంత్రి తెలియజేశారు.

Read Also: తెలంగాణ వైద్య ఉద్యోగులకు గుడ్ న్యూస్
Follow Us On: Sharechat


