కలం, నల్లగొండ బ్యూరో: మాజీ మంత్రి హరీశ్ రావుపై కవిత (Kavitha) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. హరీశ్ రావు ఓ గుంటనక్క అంటూ మండిపడ్డారు. హరీశ్ రావు బీఆర్ఎస్ పార్టీలో తనకంటూ ఓ గుంపును ఏర్పాటు చేసుకుంటున్నారని ఆరోపించారు. హరీశ్ వ్యవహారం కుక్క తోక ఊపినట్టుందని వ్యాఖ్యానించారు. ఒక్క మాట అన్నందుకు సభ బాయ్ కాట్ చేస్తారా? అంటూ కవిత ప్రశ్నించారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మీడియాతో.. డబ్బులు సంపాదించడం కోసమే గుంట హరీశ్ రావు కల్వకుర్తి వంటి ప్రాజెక్టులను విస్మరించారన్నారు. 2016లో తెలంగాణకు తక్కువ నీటి వాటాకు దారితీసిన ఒప్పందంపై హరీశ్ రావు ఎందుకు సంతకం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
జూరాల నుంచి ఎందుకు నీరు తీసుకోలేదు?
జూరాల నుండి శ్రీశైలంకు సోర్స్ పాయింట్ ఎందుకు మార్చారో హరీశ్ రావు (Harish Rao) సమాధానం చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. కృష్ణా పంపకాలల్లో హక్కులు తగ్గించి హరీశ్ సంతకం ఎందుకు పెట్టాడో చెప్పి పీపీటీ చేయాలని కోరారు. హరీశ్ రావు ధన దాహం కోసమే జూరాల నుండి శ్రీశైలానికి మార్చారని ఆరోపించారు. హరీశ్ రావు నిర్ణయాలతో సాగు నీటి ప్రాజెక్టులకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. వ్యక్తిగతంగా హరీశ్ను ఒక్క మాట అన్నందుకు సభను బహిష్కరిస్తారా? అంటూ మండిపడ్డారు.
ఆ ఒక్కరోజు సభనుంచి వాకౌట్ చేసి తర్వాత వెళ్లి ఉండొచ్చు కదా అంటూ వ్యాఖ్యానించారు. మిగతా బిల్లులపై చర్చ జరుగుతుంటే ప్రతిపక్షం ఉండొద్దా? సభ నుంచి వాకౌట్ చేయాలనే నిర్ణయం హరీశ్రావు దేనా? అని నిలదీశారు. చట్ట సభల్లో మాట్లాడే అవకాశం వదులుకోవడం కరెక్ట్ కాదన్నారు. ప్రతిపక్షం లేకుండా కృష్ణా నీటిపై అడ్డగోలు అబద్ధాలు మాట్లాడుతున్నారని, అసెంబ్లీలో కేసీఆర్ తప్పులు చేశాడనే తప్ప కృష్ణా నది నీటి వాటాపై చర్చ లేదని మండిపడ్డారు. ఆల్మట్టి ఎత్తు పెంచుకుంటే ఉత్తరం రాసి వదిలేశారని, కృష్ణాపై చిత్తశుద్ధి ఉంటే ఎందుకు సమగ్ర చర్చ జరపడంలేదన్నారు. తుంగభద్ర , కృష్ణ నీటి పై కర్నాటకతో పేచీ ఉంటే రెండు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నా ఎందుకు పరిష్కరించడంలేదనీ ప్రశ్నించారు. కురచ స్వభావంతో గత ప్రభుత్వంపై ని నిందలు వేస్తూ సీఎం రేవంత్ రెడ్డి తప్పులు కప్పిపుచ్చుకుంటున్నారని ఆరోపించారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే కర్ణాటక అప్పర్ భద్ర జాతీయ హోదా తొలగించాలని , ఆల్మట్టి ఎత్తు తగ్గించాలని తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.

Read Also: ఆ దేశంలో యూట్యూబర్ అన్వేష్పై ఫిర్యాదు.. ఇక ఎంట్రీ లేనట్టేనా?
Follow Us On: X(Twitter)


