కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనీ బూర్గంపాడు (Burgampadu) పోలీస్ స్టేషన్ పరిధిలోగల రాజీవ్ నగర్ శివార్లలో కోడిపందాల స్థావరంపై దాడి చేసి 9 మంది వ్యక్తులను జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో కోడిపందాల స్థావరంపై దాడి చేసి నిందితుల వద్ద నుంచి 17 వేల రూపాయలు, 8 సెల్ ఫోన్లు, 8 బైకులతో పాటు పందాలకు ఉపయోగించిన ఏడు కోళ్లను, 12 కత్తులను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్ రమాకాంత్ శనివారం తెలిపారు.
పట్టుబడిన నిందితులను బూర్గంపాడు (Burgampadu) పోలీసులకు అప్పగించి వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గంజాయి అక్రమ రవాణా, పేకాట, కోడిపందాలు, బెట్టింగులు వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


