కలం, వెబ్ డెస్క్: నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న ‘ది ప్యారడైజ్’ (The Paradise) మూవీకి టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ నెల 24వ తేదీన చిత్రం విడుదల కాబోతుండగా.. ఒక్క రోజు ముందు 23న సాయంత్రం వేసే ప్రీమియర్ షోలకు టికెట్ రేట్ రూ.500 ఖరారు చేసింది. 24 నుంచి 27వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్లలో టికెట్ రేటుపై అదనంగా రూ.48, మల్టీప్లెక్స్లు, స్పెషల్ థియేటర్లలో రూ.95 అదనంగా పెంచుకోవచ్చు. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ మూడో తేదీ వరకు సింగిల్ స్క్రీన్లలో రూ.23, అదే మల్టీప్లెక్స్లు, స్పెషల్ థియేటర్లలో రూ.45 అదనంగా పెంచుకునే అవకాశం కల్పించింది.
పది రోజుల పాటు పెంచిన టికెట్ల రేట్లు అమల్లో ఉంటాయి. ఆ తరువాత సాధారణ రేట్లకే టికెట్లు విక్రయించాల్సి ఉంటుందని జీవోలో స్పష్టం చేశారు. అదే సమయంలో.. చిత్ర నిర్మాణ సంస్థ కచ్చితంగా కోటి రూపాయలను తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోని ఉద్యోగులు, సిబ్బంది సంక్షేమానికి అందించాల్సి ఉంటుంది. మూవీ ప్రారంభమయ్యేటప్పుడు డ్రగ్స్ వాడకం నిరోధించడంతో పాటు సైబర్ క్రైం నేరాలపై అవగాహన కల్పించేలా రూపొందించిన యాడ్ ప్రదర్శించాలని స్పష్టం చేసింది.

