కలం, నిర్మల్ : బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (MLA Alleti Maheshwar Reddy)ని ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో గణేష్ ఉత్సవ సమితి సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. సమితి అధ్యక్షుడు మూర్తి ప్రభు ఆధ్వర్యంలో సభ్యులు ఎమ్మెల్యేను కలిసి ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు మాట్లాడుతూ.. సోమవారం జిల్లా కేంద్రంలోని గణేష్ మండపాల నిర్వాహకులతో స్థానిక ప్రభుత్వ పెన్షనర్ల సంఘ భవనంలో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గణేష్ ఉత్సవాల నిర్వహణ, నిమజ్జన కార్యక్రమాలకు సంబంధించిన అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్లు వివరించారు. ఈ సమావేశానికి వివిధ శాఖలకు చెందిన అధికారులు హాజరై అవసరమైన సూచనలు, మార్గదర్శకాలను అందించనున్నట్లు తెలిపారు. గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో, సమన్వయంతో నిర్వహించేందుకు నిర్వాహకులు సహకరించాలని కోరారు.

