కలం, నాగర్ కర్నూల్: మహాత్మా జ్యోతిబా ఫూలే బాలుర జూనియర్ కళాశాల విద్యార్థి కాలువ భరత్ ఆత్మహత్య ఘటనపై సమగ్ర విచారణ జరపాలని నాగర్ కర్నూల్ జిల్లా బీఆర్ఎస్వీ (Nagarkurnool BRSV) నేతలు డిమాండ్ చేశారు. విద్యార్థి మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నాగర్ కర్నూల్ పట్టణంలోని కళాశాల వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ నేతలు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులు వారిని బలవంతంగా వ్యాన్లో ఎక్కించి తెలకపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
విద్యార్థులకు బెదిరింపులు..
ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ జిల్లా సమన్వయకర్త అతినారపు విష్ణు సాగర్ మాట్లాడుతూ… భరత్ మరణానికి కళాశాల సిబ్బంది వేధింపులే కారణమని ఆరోపించారు. విద్యార్థులను హాస్టల్లో నిర్బంధించి టీసీలు ఇచ్చి పంపిస్తామని, హాల్ టికెట్లు ఇవ్వబోమని ఆర్సీవో, ప్రిన్సిపల్ బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు అధ్యాపకులను అధికార పార్టీ నేతలు, ఆర్సీవో, కొందరు పోలీసు అధికారులు కాపాడే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. భరత్ మృతిపై నిష్పక్షపాత విచారణ జరిపి, నిజమని తేలితే అధ్యాపకులను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్వీ నాయకులు నరసింహ, అఖిల్ గౌడ్, లక్నారం బాలు, జానకిరామ్, ప్రశాంత్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

