కలం, వెబ్ డెస్క్ : ఉపరితల ఆవర్తన ప్రభావంతో శనివారం సాయంత్రానికి ఉత్తర అండమాన్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది క్రమంగా బలపడి, తదుపరి మూడునాలుగు రోజులలో పశ్చిమవాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా – ఉత్తరాంధ్ర తీరాల వైపు పయనించే అవకాశం ఉందని వెల్లడించారు. అయితే ఉపరితల ఆవర్తన ప్రభావంతో శనివారం మన్యం, అల్లూరి, పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు (AP Rain Alert) పడతాయని చెప్పారు.
తీవ్రమైన పిడుగుల ముప్పు ఉన్నందున ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలు, పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు వర్షం పడే సమయంలో ఎత్తైన చెట్లు లేదా విద్యుత్ స్తంభాల కింద నిలబడకూడదన్నారు. ఈదురుగాలులు బలంగా వీచే సూచనలు ఉన్నందున శిథిలావస్థలో ఉన్న భవనాలు, విజిబుల్ హోర్డింగ్స్, అలాగే ప్రాచీన గోడల సమీపంలో ఉండవద్దని చెప్పారు. ఉరుముల శబ్దం రాగానే వెంటనే సురక్షితమైన పక్కా భవనాల్లోకి చేరాలని పేర్కొన్నారు.

