కలం, సారంగాపూర్ : గణపతి నిమజ్జన శోభాయాత్రను నేటి తరహాలో డీజే హంగామా లేకుండా సంప్రదాయ పద్ధతిలో నిర్వహించి బోరిగాం (Borigam Village) గ్రామ చిన్నారులు ఆకట్టుకున్నారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం బోరిగాం గ్రామంలో చిన్నారులు ప్రతిష్ఠించిన మట్టి వినాయకుడికి ఐదు రోజులపాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గణనాథుడిని ఎడ్లబండిపై ప్రతిష్ఠించి నిమజ్జన శోభాయాత్ర చేపట్టారు. ఎడ్లబండిని పూలు, రంగురంగుల చీరలతో అందంగా అలంకరించగా.. ఎడ్లను సైతం ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. బండి చక్రాలకు అందమైన ముగ్గులు వేసి సంప్రదాయ శోభను తీసుకొచ్చారు. డీజే సౌండ్లకు బదులుగా డప్పు చప్పుళ్ల నడుమ చిన్నారులు నృత్యాలు చేస్తూ శోభాయాత్రలో సందడి చేశారు. శోభాయాత్రను గ్రామస్తులు ఆసక్తిగా తిలకిస్తూ ఆనాటి పల్లె సంస్కృతిని గుర్తు చేసుకున్నారు. అనంతరం గ్రామ చెరువులో వినాయకుడిని నిమజ్జనం చేసి.. “పోయిరా గణపయ్య.. మళ్లీ త్వరగా రావయ్య” అంటూ భక్తిశ్రద్ధలతో వీడ్కోలు పలికారు.

