కలం, వెబ్ డెస్క్ : పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ కోహాట్ (Kohat Attack) నగరంలో ఘోర ఉగ్రవాద దాడి జరిగింది. పోలీసు లైన్స్ ప్రాంగణంలోని మసీదు సమీపంలోకి ఓ ఉగ్రవాది పేలుడు పదార్థాలతో నిండిన వాహనంతో దూసుకొచ్చి, విస్ఫోటనానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఇప్పటివరకు 21 మంది దుర్మరణం చెందగా, 80 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మసీదులో పెద్ద సంఖ్యలో జనం సమకూరిన సమయంలో ఈ పేలుడు సంభవించింది. దాడి తీవ్రతకు మసీదు పైకప్పు కుప్పకూలగా, సమీపంలో ఉన్న పోలీసు భవనం ప్రహరీ గోడ సైతం పూర్తిగా నేలమట్టమైంది. పేలుడు ధాటికి చుట్టుపక్కల భవనాలు, వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
అయితే పేలుడు సంభవించిన సమయంలో మరో ఇద్దరు ఉగ్రవాదులు భద్రతా ప్రాంగణంలోకి చొరబడేందుకు ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే ఎదురుకాల్పులు ప్రారంభించారు. ఈ పోరులో ఓ ఉగ్రవాది అక్కడికక్కడే హతమయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్లు, స్థానిక ప్రజలు శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు చర్యలు చేపట్టారు. బాధితులను సమీపంలోని జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

