కలం, హనుమకొండ: వరంగల్ (Warangal) నగరంలోని చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. చెరువులు, కుంటలకు ఎఫ్టీఎల్ మార్కింగ్ చేపట్టి ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాలని సూచించారు. శుక్రవారం ఖిలా వరంగల్లోని గుండు చెరువు వద్ద వరంగల్, హనుమకొండ జిల్లాల చెరువుల పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. చెరువులు, కుంటలు, నాలాల విస్తీర్ణం, ప్రస్తుత పరిస్థితి, పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై సాగునీటిపారుదల, రెవెన్యూ, కుడా, సర్వే తదితర శాఖల అధికారులతో సమీక్షించారు.
చెరువులు, కుంటలు, నాలాలను నోటిఫై చేసే ప్రక్రియను త్వరగా పూర్తి చేయాని కలెక్టర్లు ఆదేశించారు. ప్రతి నాలాకు సంబంధించిన ఫీల్డ్ రిపోర్టును ఇరిగేషన్ అధికారులు అందజేయాలని కలెక్టర్లు సూచించారు. ఎఫ్టీఎల్ నోటిఫికేషన్కు ముందు క్షేత్రస్థాయి నివేదిక కీలకమని పేర్కొన్నారు. చెరువు శిఖం, ఎఫ్టీఎల్ పరిధులను క్షేత్రస్థాయిలో స్పష్టంగా మార్కింగ్ చేసి ఆక్రమణలకు తావులేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నాలా కన్వర్షన్ సమయంలో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని సూచించారు.

