కలం, ఖమ్మం బ్యూరో: “ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ వీడియోలు చేయకండి, అనవసరంగా రిస్క్లో పడకండి” అంటూ ఓ ఇన్ఫ్లూయెన్సర్ (Khammam Influencer) కన్నీటి పర్యంతమయ్యాడు. ఖమ్మం నగరాన్ని వదిలి వెళ్లిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమవుతోంది. కాంగ్రెస్ నేతల నుంచి వరుస బెదిరింపులు రావడంతో ప్రాణభయంతో సదరు సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ ఊరు విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఖమ్మంలోని శ్రీనివాసనగర్లో ఇళ్లను అక్రమంగా కూల్చివేశారంటూ బాధితులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. ఆ ఆందోళనలకు సంబంధించిన దృశ్యాలను, వారి ఆవేదనను ఇన్ఫ్లూయెన్సర్ తన ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో అధికార కాంగ్రెస్ నాయకులు ఇన్ఫ్లూయెన్సర్ను లక్ష్యంగా చేసుకుని బెదిరింపు మెసేజ్లు, హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది.
కాంగ్రెస్ నేతల వేధింపులతో భయాందోళనకు గురైన సదరు ఇన్ఫ్లూయెన్సర్ శ్రీనివాసనగర్ కూల్చివేతలకు సంబంధించిన వీడియోలన్నింటినీ తన ఖాతా నుంచి డిలీట్ చేశారు. ఆపై తాను ఖమ్మం వదిలి వెళ్తున్నట్లు వెల్లడిస్తూ మరొక వీడియోను విడుదల చేశారు. “ఎవరూ రిస్క్ తీసుకోకండి” అంటూ ఆయన చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. బాధితుల గొంతుకగా నిలిచినందుకు బెదిరింపులకు దిగుతారా అంటూ నెటిజన్లు, ప్రతిపక్ష నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు.

