కలం, మునుగోడు: విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకొని, క్రమశిక్షణతో ఉన్నత లక్ష్యాలను సాధించాలని చండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, భరోసా సెంటర్ కో-ఆర్డినేటర్, కౌన్సిలర్ జి. నళిని సూచించారు. శుక్రవారం చండూరు (Chandur) మున్సిపల్ కేంద్రంలోని గాంధీజీ విద్యాసంస్థల్లో నల్లగొండ భరోసా సెంటర్ (Bharosa Centre) ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళలు, పిల్లలపై జరిగే వేధింపుల నివారణకు భరోసా సెంటర్లు పనిచేస్తున్నాయని తెలిపారు. విద్యార్థులు ఆన్లైన్ మోసాలు, సైబర్ క్రైమ్పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఎలాంటి వేధింపులు ఎదురైనా భయపడకుండా పోలీసులను సంప్రదించాలని కోరారు.
మైనర్లు వాహనాలు నడపకూడదని, ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు. గంజాయి, డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ వాటికి దూరంగా ఉండాలని హెచ్చరించారు. సోషల్ మీడియా వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని లింకులను క్లిక్ చేయవద్దని సూచించారు. చట్టాలు, సైబర్ భద్రత, ఆన్లైన్ వేధింపుల నివారణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులకు అత్యవసర సహాయం అవసరమైనప్పుడు 100, 1098 నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యాసంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపాల్ జాని, పులిపాటి రాధిక, భరోసా మెడికల్ ఆఫీసర్ నిరోష, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

