కలం, వెబ్ డెస్క్: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో (Tirumala Brahmotsavam) నాలుగో రోజైన శుక్రవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు కల్పవృక్ష వాహనంపై గోవుల గోపన్న అలంకారంలో భక్తులను కటాక్షించారు. తిరుమాడ వీధుల్లో అంగరంగ వైభవంగా సాగిన వాహనసేవలో పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.
కల్పవృక్షం.. కోరికలు తీర్చే దివ్య వాహనం
క్షీరసాగర మథనంలో ఉద్భవించిన దివ్య సంపదల్లో కల్పవృక్షం ఒకటి. కోరిన ఫలాలను ప్రసాదించే కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించిన శ్రీనివాసుడు భక్తులకు సర్వాభీష్టాలను ప్రసాదించే దివ్యరూపంలో దర్శనమిచ్చారు. స్వామివారి వాహనసేవలో తిరుమల పెద్దజీయర్స్వామి, చిన్నజీయర్స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, పలువురు బోర్డు సభ్యులు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

