కలం, వెబ్ డెస్క్: మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్కు (Kuno National Park)లో ఆసక్తికరమైన దృశ్యం ఆవిష్కృతమైంది. నాలుగు పిల్లలకు ఆడ చీతా జన్మనిచ్చింది. ప్రస్తుతం ఇవి ఆరోగ్యంగా ఉన్నట్లు పార్క్ డైరెక్టర్ శర్మ వెల్లడించారు. కేజీపీ12 అనే పిలుచుకునే ఈ చిరుత పులి 2024లో కునో పార్కులోనే జన్మించింది. ఇది తాజాగా నాలుగు పిల్లలకు జన్మనివ్వడంతో దేశంలో చిరుతల సంఖ్య 52కు చేరుకుంది. వీటిలో 32 దేశంలోనే జన్మించగా.. మిగతా వాటిని నమీబియా నుంచి ప్రాజెక్ట్ చీతాలో భాగంగా తీసుకొచ్చారు. చీతాలు ఇక్కడి వాతావరణ పరిస్థితులకు అలవాటు పడటమే కాకుండా, సొంతంగా ఆవాసాలను ఏర్పాటు చేసుకుండటం శుభపరిణామమని తెలిపారు.
ఇదొక చారిత్రక సందర్భం: కేంద్ర మంత్రి
కునో నేషనల్ పార్కులో నాలుగు చిరుత పిల్లలు జన్మించడంపై కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. ఇదొక చారిత్రక సందర్భమని.. ప్రాజెక్ట్ చీతా కార్యక్రమానికి నాలుగేళ్లు పూర్తయిన మరుసటి రోజే నాలుగు పిల్లలు జన్మించడం శుభపరిణామమన్నారు. ప్రధాని మోదీ ప్రత్యేక పర్యవేక్షణలో ప్రారంభమైన ప్రాజెక్ట్ చీతా కార్యక్రమానికి సానుకూల ఫలితాలు వస్తున్నట్లు వివరించారు. కునో పార్క్ సిబ్బందితో పాటు ప్రాజెక్ట్ చీతాలో భాగస్వామ్యం అయినవారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

