కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్లో భారీ షిప్బిల్డింగ్ ప్రాజెక్టుకు అడుగులు పడుతున్నాయి. ప్రముఖ రక్షణ రంగ సంస్థ, నవరత్న హోదా కలిగిన మెజగాన్ డాక్ షిప్బిల్డర్స్ లిమిటెడ్ను రాష్ట్రానికి స్వాగతిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) తెలిపారు. దుగరాజపట్నంలో(Dugarajapatnam) ఆధునిక గ్రీన్ఫీల్డ్ షిప్యార్డ్ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టుపై రానున్న 5 నుంచి 7 ఏళ్లలో సుమారు రూ.15 వేల కోట్ల పెట్టుబడి పెట్టే అవకాశం ఉందని చంద్రబాబు తెలిపారు. దీని ద్వారా దాదాపు 45 వేల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ రంగానికి, పారిశ్రామిక అభివృద్ధికి కీలక ఊతమిస్తుందని పేర్కొన్నారు.
సుదీర్ఘ సముద్ర తీరం, వ్యూహాత్మక భౌగోళిక స్థానం, బలమైన పారిశ్రామిక వ్యవస్థను ఉపయోగించుకుని భారత్ను ప్రపంచంలోని టాప్-5 షిప్బిల్డింగ్ దేశాల్లో ఒకటిగా నిలిపే ప్రయాణంలో ఏపీ ముందంజలో ఉండేలా కృషి చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. దుగరాజపట్నం కేంద్రంగా షిప్బిల్డింగ్తో పాటు షిప్ రిపేర్, మెరైన్ ఇంజినీరింగ్, తయారీ, లాజిస్టిక్స్, అనుబంధ పరిశ్రమలు విస్తరించే అవకాశం ఉందన్నారు. ఈ ప్రాజెక్టును ప్రపంచస్థాయి షిప్బిల్డింగ్ హబ్గా అభివృద్ధి చేసేందుకు మెజగాన్ డాక్ షిప్బిల్డర్స్ లిమిటెడ్కు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు.

