కలం, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ నాయకులు సిద్దిపేటకు రావడానికి భయపడుతున్నారని, వారి భయం అర్థం కావడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు హరీశ్ రావు (Harish Rao) విమర్శలు చేశారు. సిద్దిపేటకు రావడానికి బుల్లెట్ ప్రూఫ్ బస్సులు, వేలాది మంది పోలీసులు, రోప్ పార్టీలు, డ్రోన్ కెమెరాలు ఎందుకని ఆయన ప్రశ్నించారు.
తన భూములను పరిశీలించడానికి వస్తున్నామని చెబుతున్న కాంగ్రెస్ నాయకులకు ఆయన నేరుగా ఆహ్వానం పలికారు. ఎలాంటి దాపరికం లేకుండా, ముందే సమాచారం ఇస్తే తానే స్వయంగా దగ్గరుండి తన తోటతో పాటు అన్ని భూములను చూపిస్తానని, కడుపు నిండా భోజనం పెట్టి పంపుతానని అన్నారు. తన జీవితం తెరిచిన పుస్తకమని, ప్రతీ ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తులు, భూముల వివరాలను సర్వే నంబర్లతో సహా స్పష్టంగా వెల్లడించానని చెప్పారు. రామంచలో తనకున్న 13 ఎకరాల భూమిపై అనవసరంగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
తాను ఎలాంటి భూకబ్జాలకు పాల్పడలేదని, ప్రజల సొమ్మును దోచుకోలేదని హరీశ్ రావు స్పష్టం చేశారు. సిద్దిపేట ప్రజలు తన పనితనాన్ని చూసి ఏడుసార్లు గెలిపించి ఆశీర్వదించారని గుర్తుచేశారు. సిద్దిపేట అంటేనే ప్రేమ, ఆప్యాయత, ఆతిథ్యానికి ప్రతీక అని, ఎవరైనా ధైర్యంగా రావచ్చని, పోలీసుల రక్షణ వెనుక దాక్కోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

