కలం, వెబ్ డెస్క్ : తాను స్థాపించే కొత్త పార్టీపై మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) మరోసారి ప్రకటన చేశారు. నేడు అనంతపురంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మూడో ప్రత్నామ్నాయ రాజకీయ వేదిక అవసరమన్న ఆయన.. టీడీపీ, వైసీపీకి ప్రత్యామ్నయంగా తమ పార్టీ ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు, జగన్ ఫ్యామిలీలే అభివృద్ధి చెందుతున్నాయని తప్ప, ప్రజలు మాత్రం పేదరికంలోనే మగ్గుతున్నారని వ్యాఖ్యానించారు.
రాష్ట్రాన్ని చంద్రబాబు, జగన్ కుటుంబాలే పాలిస్తున్నాయని విజయసాయి రెడ్డి అన్నారు. 2029లో టీడీపీకి ఓటు వేస్తే నారా లోకేష్ సీఎం అవుతారని, లేదంటే వైసీపీకి ఓటు వేస్తే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవుతారని పేర్కొన్నారు. అయితే చంద్రబాబు, జగన్ ఇద్దరూ స్వార్థ పరులని విమర్శించారు. పోటీతత్వం ఉంటేనే అవినీతిపై పోరాటం చేయొచ్చన్నారు. తాను పెట్టబోయే పార్టీకి ఓటు వేస్తే యువతరంలో ఒకరు సీఎం అవుతారని చెప్పారు. తాను యువతకు అవకాశం ఇచ్చి, వారికి మార్గదర్శకుడిగా ఉంటూ.. అవసరమైనప్పుడు సలహాలు ఇస్తూ ముందుకు నడిపిస్తానని వెల్లడించారు.
ఈ క్రమంలోనే తాను ఏ కులానికి, మతాలకు కొమ్ము కాయడం లేదన్నారు. అలాగే మత మార్పిడిలకు వ్యతిరేకమని చెప్పారు. టీడీపీ, వైసీపీకి రాయలసీమ కేవలం ఓట్ల కోసమే అవసరమని విమర్శలు గుప్పించారు. రాయలసీమ వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటున్నప్పటికీ ఇక్కడ అభివృద్ధి జరగడం లేదని, రాష్ట్రంలో అత్యధికంగా వలసలు రాయలసీమ నుంచే జరుగుతున్నాయని అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రాయలసీమను అభివృద్ధి చేసి ‘రతనాల సీమ’గా మారుస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రెడ్డి కార్పొరేషన్ను ఏర్పాటు చేయలేదని, వెంటనే ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాదు ఒరిజినల్ రెడ్ల ఆత్మగౌరవ పౌరుషాన్ని కాపాడే విధంగా తాను విజయ దశమి తర్వాత కొత్త పార్టీ ఏర్పాటు చేయన్నున్నట్లు తెలిపారు.

