కలం, ఖమ్మం బ్యూరో: ఇద్దరు పిల్లలకు కూల్డ్రింక్లో విషమిచ్చి, తాను తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఓ తండ్రి. ఈ ఘోర ఉదంతం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి (Nelakondapalli) మండలంలో తీవ్ర విషాదం రేపింది. ఈ ఘటనలో తండ్రి, కుమార్తె ప్రాణాలు కోల్పోగా, కుమారుడు చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో పోరాడుతున్నాడు. మండలంలోని అప్పలనర్సింహాపురం గ్రామానికి చెందిన పుసులూరి శ్రీనివాసరావు ఎన్టీఆర్ జిల్లా గండ్రాయి గ్రామంలో పొలాన్ని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు.
కోదాడలో చదువుతున్న తన కుమార్తె లాస్యతోపాటు కుమారుడు నిఖిల్ను వెంటబెట్టుకుని వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్లాడు. అక్కడ గడ్డిమందును కూల్డ్రింక్లో కలిపి పిల్లలకు తాపించాడు. తాను కూడా తాగిన శ్రీనివాసరావు, బావకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. బంధువులు వెంటనే పొలం వద్దకు చేరుకున్నారు. అక్కడ స్పృహతప్పి పడి ఉన్న ముగ్గురిని ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.
మార్గమధ్యలోనే తండ్రి శ్రీనివాసరావు, కుమార్తె లాస్య మరణించగా, ప్రాణాపాయ స్థితిలో ఉన్న కుమారుడు నిఖిల్ను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. కన్నతండ్రే ఈ రకమైన ఘటనకు ఒడిగట్టడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో అప్పలనర్సింహాపురం గ్రామంలో శోకసంద్రం అలుముకుంది.

