కలం, వెబ్ డెస్క్: ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh) లోని ప్రతాప్గఢ్ జిల్లా, హత్విగాన్ (Hathigawan) పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లక్నో నుంచి ప్రయాగరాజ్ వైపు వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలు ఢీకొనండంతో 30 నుంచి 35 మేకలు అక్కడికక్కడే మృతిచెందాయి.
వివరాల్లోకి వెళితే.. హత్విగాన్ పరిధిలోని రైల్వే గేట్ సమీపంలో ప్రయాగ్రాజ్–లక్నో రైల్వే లైన్పై ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో మేకలను మేపడానికి తీసుకెళ్లిన ముగ్గురు మహిళలు వాటిని ఇంటికి తీసుకువస్తున్నారు. ఆ సమయంలో మేకల మంద ఒక్కసారిగా రైల్వే ట్రాక్పైకి వచ్చింది.
అదే సమయంలో వేగంగా వస్తున్న ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ను గమనించిన గేట్మ్యాన్ గట్టిగా కేకలు వేసి హెచ్చరించడంతో, ఆ మహిళలు పట్టాల పైనుంచి పక్కకు తప్పుకుని తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. కానీ పట్టాలపై వెళ్తున్న మేకలను అక్కడి నుంచి తప్పించేందుకు మహిళలు ఎంత ప్రయత్నించినా అవి కిందకు దిగకపోవడంతో వేగంగా వస్తున్న రైలు వాటిని ఢీకొట్టుకుంటూ వెళ్లింది.
ప్రమాదం జరిగిన వెంటనే రైలును దాదాపు 10 నుంచి 20 నిమిషాల పాటు అక్కడ నిలిపివేశారు. సమాచారం అందుకున్న ఆర్పీఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్ను పరిశీలించారు. మేకల మృతదేహాలను తొలగించి మార్గాన్ని పునరుద్ధరించారు.

