కలం, వెబ్డెస్క్: గణేష్ నిమజ్జన విధుల్లో ఉన్న కీసర ఎస్ఐ (Keesara SI) జ్ఞానేందర్ రెడ్డి (Gnanender Reddy) రూ.5 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ (ACB) అధికారులు బుదవారం అర్దరాత్రి తర్వాత అదుపులోకి తీసుకున్నారు. ఒక కేసులో స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు కీసర సీఐ ఎ.ఆంజనేయులు రూ.10 లక్షలు డిమాండ్ చేశాడు. చివరకు రూ.5 లక్షలకు ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలోనే ఇన్స్పెక్టర్ తరఫున ఎస్ఐ జ్ఞానేందర్ రెడ్డి కీసర చెరువు వద్ద నిమజ్జన విధుల్లో ఉన్న సమయంలో బాధితుడి నుంచి నగదు స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అధికారులను చూడగానే ఎస్ఐ పరారయ్యేందుకు ప్రయత్నించాడు. సిబ్బంది వెంటనే అప్రమత్తమై అడ్డుకున్నారు.
బిర్యానీలు, కూల్ డ్రింక్స్ కూడా..
కెమికల్ పరీక్షలకు సంబంధించి సీఐ, ఎస్సై తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని బాధితులు వెల్లడించారు. కొన్ని రోజులుగా పోలీస్ స్టేషన్కు బిర్యానీలు, కూల్ డ్రింక్స్ తీసుకురావాలని ఈ అధికారులు వేధించారని తెలిపారు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో ఈ దాడులు నిర్వహించారు. ఈ ఘటనకు సంబంధించి కీసర పోలీస్ స్టేషన్తో పాటు సంబంధిత అధికారుల నివాసాలలోనూ ఏసీబీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మజీద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

