కలం, జోగులాంబ గద్వాల: పాలిటెక్నిక్ విద్యను నిర్వీ ర్యం చేయడంతోపాటు ప్రైవేటీకరణ దిశగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 97 జీవోను రద్దు చేయాలని గద్వాలలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు డిమాండ్ చేశారు. మంగళవారం గద్వాల (Gadwal) మండలం గోనుపాడు వద్ద ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ముందు విద్యార్థులు బైఠాయించి నిరసన చేపట్టారు. ‘శక్తి వద్దు.. పాలిటెక్నిక్ ముద్దు’ అనే నినాదంతో విద్యార్థుల భవిష్యత్తు కోసం తమ పోరాటం కొనసాగుతుందని వెల్లడించారు. ప్రభుత్వం వెంటనే GO 97ను రద్దు చేసి, పాలిటెక్నిక్ విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
పాలిటెక్నిక్ విద్య ప్రమాణాలను మరింత మెరుగుపరచాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా ఇతర శిక్షణ కోర్సులతో అనుసంధానం చేయడం సరికాదన్నారు. ఈ నిర్ణయం వల్ల పాలిటెక్నిక్ విద్యార్థుల విద్యాప్రమాణాలు, ఉన్నత విద్యా అవకాశాలు, ఉపాధి అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి తగిన బడ్జెట్ కేటాయించకుండా విద్యా వ్యవస్థను ప్రైవేటీకరణ వైపు తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

