కరీంనగర్: పద్మనగర్లోని మానేరు సీబీఎస్ఈ పాఠశాల ఆవరణలో జరుగుతున్న 70వ కరీంనగర్ అర్బన్ అండర్ 14, 17 బాలబాలికల కబడ్డీ చాంపియన్ షిప్ (Kabaddi Championship) పోటీలు మంగళవారం ముగిసాయి. బాలబాలికల విభాగంలో విజేతలుగా నిలిచిన జట్లకు మానేరు విద్యాసంస్థల అధినేత కడారి అనంతరెడ్డి (Kadari Anantha Reddy) ట్రోఫీలను, పతకాలను ప్రదానం చేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలతో శారీరక మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. ఎస్జీఎఫ్ క్రీడల్లో విద్యార్థులు అద్బుతంగా రాణించి జిల్లా పేరు నిలపాలన్నారు. మానేరులో వరుసగా రెండో సంవత్సరం ఎస్జీఎఫ్ కబడ్డీ పోటీలను ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. క్రీడలతో పాటు విద్యలోను రాణించాలని విద్యార్థులకు సూచించారు. భవిష్యత్లో మానేరు విద్యాసంస్థల ఆధ్వర్యంలో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలను నిర్వహించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు.
ఎస్జీఎఫ్ అర్బన్ కార్యదర్శి అంతటి శంకరయ్య మాట్లాడుతూ.. అండర్ 14, 17 బాలబాలికల విభాగంలో సుమారు 60 పాఠశాలల నుంచి 2,500 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. అర్బన్ పోటిల్లో రాణించిన క్రీడాకారులను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు తెలిపారు. అనంతరం ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో మానేరు విద్యాసంస్థల చైర్మన్ కడారి అనంతరెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్జీఎఫ్ మాజీ కార్యదర్శి వేణుగోపాల్, పీడీ, పీఈటీలు సిలివేరి మహేందర్, లింగారావు, శ్రీధర్ రెడ్డి, నరేష్, చిరంజీవి, అజయ్, స్వామి, మహేష్, శ్రీనివాస్, అర్జున్, సాయి, తదితరులు పాల్గొన్నారు.

