కలం, వరంగల్ బ్యూరో : మాజీ మంత్రి కొండా సురేఖకు (Konda Surekha) కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి ఢిల్లీ రావాలంటూ పిలుపు రావడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల మంత్రి పదవి నుంచి తప్పుకున్న సురేఖకు క్యాబినెట్ హోదాతో సమానమైన కీలక పదవి అప్పగించే అవకాశం ఉందనే ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో సాగుతోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
ముఖ్య కార్యకర్తలతో సురేఖ, మురళీ భేటీ
ఢిల్లీ పిలుపు నేపథ్యంలో హనుమకొండ (Hanumakonda) రాంనగర్లోని తన నివాసంలో సురేఖ, కొండా మురళీ ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కొండా సురేఖను తిరిగి మంత్రి వర్గంలోకి తీసుకోవాలని కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. పార్టీ కోసం పనిచేసిన నాయకురాలికి మరోసారి అవకాశం కల్పించాలని కోరుతున్నారు. సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించిన నేపథ్యంలో కార్యకర్తల విజ్ఞప్తి ప్రాధాన్యం సంతరించుకుంది.
ఢిల్లీ అధిష్టానం నుంచి సురేఖ(Konda Surekha)కు పిలుపువచ్చిన వచ్చిన వేళ తాజా సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాంగ్రెస్ హైకమండ్ కొండా సురేఖ విషయంలో మంచి నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్తలతో సమావేశం అనంతరం సురేఖ ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధిష్ఠానంలోని ముఖ్య నేతలను కలిసే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆదివారం సాయంత్రం ఆమె ఢిల్లీ బయలుదేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.
సురేఖ తదుపరి అడుగు ఏంటి?
సురేఖకు అధిష్ఠానం ఎలాంటి బాధ్యత అప్పగించనుందనే అంశంపై కాంగ్రెస్ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది. కీలక పదవి ఇవ్వనున్నారనే ప్రచారం నేపథ్యంలో ఆమె రాజకీయ భవిష్యత్పై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా, ఇటీవల కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్తో సురేఖమాట్లాడారని, బర్తరఫ్ తర్వాతి పరిణామాలపై వారు చర్చించారని తెలిసింది. మంత్రి పదవి నుంచి తప్పుకున్న అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు, భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని, అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని సురేఖకు సూచించినట్లు సమాచారం.
Also Read : 400 ఏళ్ల అనుబంధం.. తిరుమల శ్రీవారికి గద్వాల ఏరువాడ జోడు పంచెలు
Follow Us On: X(Twitter)

