కలం, నిర్మల్ : నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి గ్రామ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో (Dichpally Road Accident) నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం కంజర్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న భోజన్న మృతి చెందాడు. తమ బంధువులను కారులో హైదరాబాద్ ఎయిర్పోర్టులో డ్రాప్ చేసి గురువారం ఉదయం తిరిగి ఇంటికి బయలుదేరారు. డిచ్పల్లి గ్రామ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వారు ప్రయాణిస్తున్న కారు వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భోజన్న తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న మనోజ్, గంగాధర్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని నిజామాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుడు భోజన్నకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, సహచర ఉపాధ్యాయులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

