కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ధరూర్ మండలంలోని నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా ఫేజ్ -1 లో నిర్మించిన గుడెందొడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (Gudemdoddi Reservoir) నీటి నిల్వ సామర్థ్యాన్ని 1.19 టిఎంసీల నుంచి 15 టీఎంసీలకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 467 బుధవారం (9-9-2026) ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం 1.19 TMC నుంచి 15 TMCకి రిజర్వాయర్ సామర్థ్యం పెంపునకు నిర్ణయం తీసుకుంది. (PSP) మోడల్లో, సోలార్ పవర్ జనరేషన్తో అనుసంధానం చేసి ప్రాజెక్టు చేపట్టేందుకు ఆమోదం తెలిపింది.
రూ.15 కోట్ల పరిపాలనా అనుమతులు..
ఈ ప్రాజెక్టు సర్వేలు, అధ్యయనాల కోసం రూ.15 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. గూడెం దొడ్డి ప్రాజెక్టు (Gudemdoddi Reservoir) కోసం అదనంగా 1,100 ఎకరాల భూసేకరణకు రూ.165 కోట్ల నిధుల మంజూరు చేసింది. గూడెందొడ్డి సామర్థ్యం పెంపుకు, సర్వేల కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడంతో జిల్లా ప్రజల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది. సామర్థ్యం పెంపుతో ప్రాజెక్టు గుండెకాయలా మారనుందని సాగునీటి నిపుణులు చెబుతున్నారు.
ఇప్పటికే నివేదిక..
గూడెందొడ్డి జలాశయం సామర్థ్యం పెంపు వల్ల కలిగే ప్రయోజనాలు, ముంపు భూములు, గ్రామాలకు సంబంధించి సాగునీటి శాఖ అధికారులు ప్రాథమిక నివేదికను ఇప్పటికే ప్రభుత్వానికి ఉన్నతాధికారులు అందజేశారు. దాని ఆధారంగానే డీపీఆర్ సర్వే చేసి 15 టీఎంసీల నీటి నిల్వకు ముంపునకు గురైన భూములు కాకుండా మరో 1100 ఎకరాలు అవసరం ఉంటుందని ప్రాజెక్టు అధికారులు అంచన వేస్తున్నారు. దీంతో గూడెం దొడ్డి ప్రాజెక్టుకు లైన్ క్లియర్ అయింది .రిజర్వాయర్ కింద సుమారు 63,000 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యం ఉంది.
పలు మండలాలకు సాగునీరు..
జోగులాంబ గద్వాల జిల్లాలోని ధరూర్, గట్టు, మల్దకల్, గద్వాల్, అయిజ మండలాలలోని మెట్ట ప్రాంతాలకు ఇది సాగునీరు అందిస్తుంది. 2026 జూన్ నెలలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గూడెం దొడ్డి రిజర్వాయర్ స్టేజ్-1 పంప్ హౌస్ను స్వయంగా సందర్శించి, పనుల పురోగతిని పరిశీలించారు. రిజర్వాయర్ విస్తరణ మరియు పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది.ఈ నిధులతో రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచి, కాలువల పనులను వేగవంతం చేయాలని నిర్ణయించారు. ప్రాజెక్టు ఫేజ్-1 పనులను 2027 డిసెంబర్ నాటికి, ఫేజ్-2 పనులను 2028 అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.
మారనున్న రూపురేఖలు..
గత కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగాయి. సాంకేతిక సమస్యలు, గేట్ల నిర్వహణలో లోపాల వల్ల ఆశించిన స్థాయిలో నీరు రైతులకు అందలేదు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా జూరాల నుంచి నీటిని ఎత్తిపోసి గూడెం దొడ్డికి, అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు (ర్యాలంపాడు రిజర్వాయర్ వంటివి) తరలించాల్సి ఉంటుంది. గూడెం దొడ్డి రిజర్వాయర్ పూర్తయితే గద్వాల జిల్లాలోని కరువు పీడిత ప్రాంతాల రూపురేఖలు మారిపోతాయి. తాజా నిధుల కేటాయింపుతో ఈ ప్రాజెక్టు త్వరలోనే పూర్తి సామర్థ్యంతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Also Read : ఏఐ పిక్స్తో ‘రాజకీయ రచ్చ’.. బీజేపీ vs కాంగ్రెస్!
Follow Us On: X(Twitter)

