బీసీ పొలిటికల్‌ జేఏసీ ఫిర్యాదు.. ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్‌

కలం, వనపర్తి: అవినీతికి పాల్పడే అధికారులపై నిరంతరం పోరాటం చేస్తామని బీసీ పొలిటికల్‌ జేఏసీ (BC Political JAC) జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేందర్‌ నాయుడు అన్నారు. బీసీ పొలిటికల్‌ జేఏసీ ఆధ్వర్యంలో చేసిన ఫిర్యాదులపై అధికారులు స్పందించి ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్‌ చేయడం తమ పోరాటానికి మరో విజయమని పేర్కొన్నారు.

గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల వనపర్తి బీసీ వసతి గృహం వార్డెన్‌, సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ ఉద్యోగికి సంబంధించిన అవినీతి ఆరోపణలు రావడంతో సాక్ష్యాధారాలతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, అదనపు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

దీనిపై విచారణ చేపట్టిన అధికారులు ఇద్దరినీ సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని మహేందర్‌ చెప్పారు. ప్రజలు చెల్లించే పన్నులతో వేతనాలు పొందుతూ అక్రమాలకు పాల్పడే అధికారులపై తమ పోరాటం కొనసాగుతుందని మహేందర్‌ నాయుడు అన్నారు. గతంలోనూ పలువురు అవినీతి అధికారులపై చర్యలు తీసుకునేలా పోరాటం చేసినట్లు పేర్కొన్నారు.

నిజాయితీగా పనిచేసే అధికారులకు జేఏసీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఫిర్యాదులపై స్పందించి విచారణ జరిపి చర్యలు తీసుకున్న జిల్లా ఉన్నతాధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో బీసీ పొలిటికల్‌ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి వీవీ గౌడ్‌, వనపర్తి పట్టణ అధ్యక్షుడు దేవర శివ గౌడ్, శ్రీరంగాపూర్‌ మండల అధ్యక్షుడు ధర్మేంద్ర సాగర్‌, మ్యాదరి రాజు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>