కలం, తెలంగాణ బ్యూరో: కొండా సురేఖ (Konda Surekha)ను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, సంబంధిత ఫైల్ను గవర్నర్ ఆమోదం కోసం పంపడం, దాన్ని ఆమోదించినట్లు ధృవీకరించడం, ఆ తర్వాత ప్రభుత్వం గెజిట్ జారీచేయడం.. ఇవన్నీ జరిగిపోయినా ప్రభుత్వ వెబ్సైట్లలో మాత్రం దానికి తగిన మార్పులు జరగలేదు. ఇప్పటికీ కొండా సురేఖను అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా పేర్కొనడంతో పాటు ఆమె ఫొటోలు కనిపిస్తున్నాయి. మంత్రిగా ఆమె బాధ్యతలను తొలగించడం వెంటనే అమల్లోకి వస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి. సచివాలయంలోని ఆమె ఛాంబర్ను జీఏడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
మంత్రివర్గం నుంచి తొలగించే వ్యవహారం గంటల వ్యవధిలో హడావిడిగా జరిగిపోయినా.. ఇంతకాలం ఆమె నిర్వహించిన శాఖలకు సంబంధించిన వెబ్సైట్లలో మాత్రం మంత్రిగా ఆమె పేరు, ఫొటో యథావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి. అధికారులు వెరీ స్లో… అనే సాధారణ అభిప్రాయానికి తగినట్లుగానే ఆ వెబ్సైట్లలో మార్పులు చేయలేదు. డిపార్టుమెంట్ల మధ్య సమన్వయం కొరవడిందంటూ ముఖ్యమంత్రి తరచూ కొందరు అధికారులకు అక్షింతలు వేస్తూ ఉంటారు. దానికి ఇలాంటి నత్తనడక పనులే కారణమనే సెటైర్లు వినిపిస్తున్నాయి.

