కలం, వెబ్డెస్క్: మహబూబ్నగర్ జిల్లాలోని దేవరకద్ర (Devarakadra) నియోజకవర్గంలో బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress)శ్రేణుల మధ్య వాగ్వాదంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. చిన్నచింతకుంట మండల కేంద్రంలో 1000 రోజుల కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేపట్టారు. ఇదే సమయంలో కాంగ్రెస్ శ్రేణులు తమ పార్టీ వెయ్యి రోజుల పాలన గురించి సంబరాలు చేసుకుంటూ అటుగా వచ్చారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలకు వాగ్వాదం చెలరేగింది.
కాంగ్రెస్ శ్రేణులు తమ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించినట్లు బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తల తీరుపై ఆల వెంకటేశ్వర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తమ నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలను అక్కడి నుంచి వెనక్కి పంపించారు. దీంతో కొద్దిసేపు ఇరువర్గాల మధ్య వాగ్వాదం, ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనంతరం పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు సమాచారం.

