కలం, మహబూబ్ నగర్ బ్యూరో : జిల్లాలో వివిధ సాగునీటి ప్రాజెక్టులు, భారత్ మాల జాతీయ రహదారి, రైల్వేలైన్ డబ్బింగ్, పారిశ్రామిక ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Khushboo Gupta) అధికారులను ఆదేశించారు.
గురువారం కలెక్టర్ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాల్లో భారత్మాల, జాతీయ రహదారులు, రైల్వే లైన్ డబ్లింగ్, బ్రహ్మోస్ క్షిపణి తయారీ కర్మాగారం, కురుమూర్తి దేవాలయ అభివృద్ధి, ఎం.జి.కె.ఎల్.ఐ, లక్ష్మీదేవిపల్లి, అజిలాపూర్ ఎత్తిపోతల ప్రాజెక్టుల సంబంధించిన భూసేకరణతో పాటు పునరావాసం, పునరావాస పరిహారం కార్యక్రమాలపై కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ముందుగా మహబూబ్నగర్ రూరల్, భూత్పూర్, దేవరకద్ర మండలాల పరిధిలో భూసేకరణ పురోగతిని సమీక్షిస్తూ అవార్డుల ప్రక్రియ, పరిహారం చెల్లింపులు, ఖాతా ధ్రువీకరణ, న్యాయస్థాన కేసులు, వివాదాస్పద భూముల వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించి, న్యాయస్థాన పరిధిలో ఉన్నవి, ఇతర వివాదాలకు సంబంధించిన కేసులను స్పష్టంగా వర్గీకరించి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.
దేవరకద్ర మండలంలో పెండింగ్ కేసులపై నివేదికల సమర్పణలో జాప్యం చేయకుండా వెంటనే నివేదికలను సమర్పించి, మిగిలిన వాటినీ దశలవారీగా పరిష్కరించాలని ఆదేశించారు. న్యాయస్థాన కేసులకు సంబంధించిన ఓఎస్ నంబర్లను నివేదికల్లో తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. వచ్చే సమీక్ష నాటికి పెండింగ్ కేసులను పూర్తిగా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. భూత్పూర్ మండలంలో జాతీయ రహదారి భూసేకరణకు సంబంధించి స్థానికుల నుంచి ఎదురవుతున్న సమస్యలను ప్రత్యేకంగా సమీక్షించారు.
జిల్లాలో రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు సంబంధించి అవసరమైన భూముల గుర్తింపు, సరిహద్దు గుర్తులు, భూ యజమానుల వివరాలు, అవార్డులు, పరిహారం చెల్లింపులపై కలెక్టర్ సమీక్షించారు. మహబూబ్నగర్ అర్బన్ మండల పరిధిలో కొన్ని ప్రాంతాల్లో సరిహద్దు గుర్తుల ప్రక్రియ పూర్తికాకపోవడం, భూసేకరణ దస్త్రాల్లో స్పష్టత లేని అంశాలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అవార్డుల ప్రక్రియను నిర్ణీత గడువులో పూర్తి చేసి, అవార్డులు జారీ అయిన ప్రాంతాల్లో పరిహారం చెల్లింపులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (టి.జి.ఐ.ఐ.సి) ఆధ్వర్యంలో చేపడుతున్న బ్రహ్మోస్ క్షిపణి తయారీ కర్మాగారానికి అవసరమైన భూసేకరణపై కలెక్టర్ సమీక్షించారు. అలాగే అమర్రాజా పరిశ్రమకు రహదారి నిర్మాణానికి అవసరమైన భూసేకరణను కూడా త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
కురుమూర్తి దేవాలయ అభివృద్ధి పనులకు అవసరమైన భూముల సర్వే పూర్తయినందున భూసేకరణకు సంబంధించిన ప్రతిపాదనలు, నివేదికలను త్వరగా సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. పట్టా భూములపై ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో భూ యజమానుల అభ్యంతరాలు, వినతులను పరిశీలించాలని ఆదేశించారు. ప్రస్తుత ధరల ప్రకారం భూముల విలువను పరిగణనలోకి తీసుకుని పరిహారం ఖచ్చితంగా లెక్కించాలని, ప్రభుత్వ, పట్టా భూముల వివరాలను వేర్వేరుగా సిద్ధం చేయాలని సూచించారు.
సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణలో సర్వే, ఎస్డీఆర్ సమర్పణ, పరిహారం చెల్లింపుల పురోగతిని కలెక్టర్ సమీక్షించారు. లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టుకు సంబంధించిన సర్వే, ఎస్డీఆర్ ప్రక్రియ పూర్తయిన భూములకు పరిహారం చెల్లింపు దస్త్రాలను వెంటనే సిద్ధం చేసి సమర్పించాలని ఆదేశించారు.
అజిలాపూర్ ఎత్తిపోతల ప్రాజెక్టు భూసేకరణకు సంబంధించి రోజువారీ పురోగతిని నమోదు చేసి పర్యవేక్షించాలని, వెంటనే పరిహారం చెల్లింపులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. ఎల్. బి హరిప్రియ, అసిస్టెంట్ కలెక్టర్ అండర్ ట్రైని సాయి శివాని, భూసేకరణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ రామ్ రెడ్డి, ఆర్డిఓ నవీన్, నీటిపారుదల శాఖ అధికారులు, తాసిల్దారులు, తదితరులు పాల్గొన్నారు.

