కలం, వెబ్ డెస్క్: పెద్దపల్లి (Peddapalli) జిల్లా రామగిరి మండలంలోని సింగరేణి సంస్థకు చెందిన అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టు (Adriyala Longwall Project) బొగ్గుగనిలో ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం గనిలోని 89వ లెవెల్ వద్ద షిఫ్ట్ ముగింపు సమయంలో కార్మికులు రూఫ్ బోల్టింగ్ పనులు నిర్వహిస్తుండగా అకస్మాత్తుగా ఎయిర్ ట్యాంక్ పేలి ప్రమాదం సంభవించింది.
ఈ ఘటనలో విధుల్లో ఉన్న ఐదుగురు కార్మికులకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే తోటి కార్మికులు, అధికారులు అప్రమత్తమయ్యారు. క్షతగాత్రులను హుటాహుటిన గోదావరిఖని సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న సింగరేణి ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు.

