కలం, వెబ్డెస్క్: రాష్ట్రంలో రానున్న ప్రతి ఎన్నికల్లో జనసేన (Janasena) పోటీ చేస్తుందని ఆ పార్టీ తెలంగాణ ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ (Nemuri Shankar Goud) వెల్లడించారు. ఇప్పటికే ఖమ్మం, వరంగల్, నల్లగొండ ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులను కూడా ప్రకటించినట్లు తెలిపారు. పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఆధ్వర్యంలో, అభిమానులు, ప్రజలతో కలిసి వేడుకలు నిర్వహించినట్లు తెలిపారు. హైదరాబాద్లోని ఫిలింగర్లో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో పవన్ కల్యాణ్ పేరిట ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఆశీస్సులతో జనసేన పోటీ చేస్తుందని, తప్పకుండా రాష్ట్రంలో పార్టీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ (Raja Singh) జనసేనలో చేరడంపై శంకర్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ ఆశయాలు, భావాలు నచ్చి రాజాసింగ్ జనసేనలోకి వస్తే ఆహ్వానిస్తామన్నారు. అధ్యక్షుడి అడుగు జాడల్లో నడుస్తూ ముందుకు వెళ్లే వాళ్లందరికీ పార్టీ స్వాగతం పలుకుతోందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా జనసేన తప్పకుండా పోటీ చేస్తుందని శంకర్ గౌడ్ తెలిపారు.

