కలం, నిజామాబాద్ బ్యూరో: జిల్లాలో అక్రమంగా PDS బియ్యం నిల్వ ఉంచిన మిల్లుపై సివిల్ సప్లై అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. పక్కా సమాచారం మేరకు నవీపేట మండలం అనంతగిరి శివారులో గల ఎస్ఆర్ఎం ట్రేడర్ (SRM Traders)పై హైదరాబాద్ టాస్క్ ఫోర్స్, సివిల్ సప్లై అధికారులు, నవీపేట పోలీసులు మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ దాడిలో ఎస్ఆర్ఎం ట్రేడర్స్ లో 523 క్వింటాళ్ల అక్రమంగా నిలువ ఉంచిన పీడీఎస్ బియ్యాన్ని స్వాధీన పరుచుకున్నట్లు సివిల్ సప్లై డిప్యూటీ తహసిల్దార్ పవన్ కుమార్ బుధవారం తెలిపారు.
భారీగా స్వాధీనం..
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం చించోలి గ్రామంలోని అన్నపూర్ణ ట్రేడర్స్ నుంచి అక్రమంగా అనంతగిరిలోని ఎస్ఆర్ఎం ట్రేడర్స్ లోకి పీడీఎస్ బియ్యాన్ని సరఫరా చేస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు. ఈ దాడిలో 523 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం పరుచుకుని, ఒక డీసీఎం వాహనాన్ని సీజ్ చేశారు. ఎస్ఆర్ఎం ట్రేడర్స్ యజమాని శివప్రసాద్, అన్నపూర్ణ మిల్లు యజమాని హరికృష్ణ లపై కేసు నమోదు నమోదు చేసినట్లు తెలిపారు.
మూడు కేసులు నమోదు..
ఎస్ఆర్ఎం ట్రేడర్స్ లో PDS అక్రమ బియ్యం రవాణా పై ఇప్పటివరకు మూడు కేసులు నమోదు అయినట్లు పేర్కొన్నారు. మరో మారు ఇలాంటి చర్యలకు పాల్పడితే పిడియాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు.. ఈ దాడిలో టాస్క్ ఫోర్స్ DSP శేఖర్ రెడ్డి, CI శ్రీనివాస్ రావు, సివిల్ సప్లై డిప్యూటీ తాసిల్దార్ రవి రాథోడ్ పాల్గొన్నారు.

