కలం, నిర్మల్: భైంసా(Bhainsa) ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో జిల్లా ఎస్పీ (Nirmal SP) జానకి షర్మిల (Janaki Sharmila) ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. వివిధ సమస్యలపై ఫిర్యాదుదారులు అందించిన వివరాలను ఎస్పీ ఓర్పుగా విని, వాటి పరిష్కారానికి సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడారు. ప్రజల ఫిర్యాదులపై చట్టపరమైన చర్యలు తీసుకుని సత్వర న్యాయం అందేలా చూడాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు. కుటుంబ వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులపై షీ టీం సిబ్బందితో కౌన్సిలింగ్ నిర్వహించి, సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు.
ఇదిలా ఉండగా, గతంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేల్లో అందిన పెండింగ్ ఫిర్యాదుల పరిష్కార స్థితిని కూడా ఎస్పీ సమీక్షించారు. పెండింగ్లో ఉన్న ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చేందుకు గ్రీవెన్స్ డే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి పోలీసు శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.

