కలం, ఖమ్మం బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1,000 రోజులు పూర్తవుతున్నా, హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ (BRS) నిరసనలకు దిగనుంది. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలపై నిరసిస్తూ ప్రజల తరఫున నిలదీసేందుకు బీఆర్ఎస్ ‘పోరుబాట’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పార్టీ పిలుపు మేరకు ఉమ్మడి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో సెప్టెంబర్ 2వ నుంచి 10 వరకు వివిధ రూపాల్లో విస్తృత నిరసన కార్యక్రమాలు నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి.
ఈ ఆందోళన కార్యక్రమాలను పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 1,000 రోజుల కాంగ్రెస్ పరిపాలనా వైఫల్యాలను, హామీల అమలు తీరును ప్రజలకు వివరిస్తామన్నారు. ప్రజా సమస్యలపై వారిని చైతన్యపరిచేందుకు పార్టీ తన పోరాటాన్ని మరింత ఉధృతం చేయడానికి స్పష్టమైన కార్యాచరణను రూపొందించింది.
ఈ నిరసన ప్రణాళికలో భాగంగా ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల పార్టీ నాయకులకు, ప్రజాప్రతినిధులకు మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ దిశానిర్దేశం చేశారు. ఖమ్మం నగరంలో నిర్వహించే ధర్నా కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్తో పాటు జిల్లా ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రత్యక్షంగా పాల్గొననున్నారు.

