పాక్ క్రికెట్‌పై కనేరియా సంచలన వ్యాఖ్యలు

కలం, స్పోర్ట్స్‌: ఇంగ్లండ్‌ (England) చేతిలో 2-0తో టెస్టు సిరీస్‌ కోల్పోయిన పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టుపై మాజీ స్పిన్నర్‌ డానిష్‌ కనేరియా (Danish Kaneria) తీవ్ర విమర్శలు చేశారు. పాకిస్థాన్‌ క్రికెట్‌ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని ఆయన వ్యాఖ్యానించారు. కేవలం ఆటగాళ్లు, కోచ్‌లను మార్చడం వల్ల సమస్య పరిష్కారం కాదని స్పష్టం చేశారు. లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టులో పాకిస్థాన్‌ 194 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో మూడు టెస్టుల సిరీస్‌ను ఇంగ్లండ్‌ 2-0తో కైవసం చేసుకుంది. ఈ పరాజయం అనంతరం పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (PCB) కీలక మార్పులు చేపట్టింది. ఏకంగా ఏడుగురు ఆటగాళ్లను జట్టు నుంచి తప్పించడంతో పాటు హెడ్‌ కోచ్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌, బౌలింగ్‌ కోచ్‌ ఉమర్‌ గుల్‌ను కూడా బాధ్యతల నుంచి తొలగించింది.

మార్పులతో సమస్య తీరదు

PCB తీసుకున్న నిర్ణయాలపై కనేరియా (Danish Kaneria) స్పందిస్తూ.. పాకిస్థాన్‌ క్రికెట్‌లో సమస్యలు ఆటగాళ్ల మార్పులతో మాత్రమే పరిష్కరించలేమన్నారు. ఆటగాళ్ల ఎంపిక, కోచింగ్‌, దేశవాళీ క్రికెట్‌, క్రికెట్‌ పాలనలో జవాబుదారీతనం వంటి అన్ని విభాగాల్లో లోపాలు ఉన్నాయని పేర్కొన్నారు. పాకిస్థాన్‌లో నాణ్యమైన బౌలర్లు, స్పిన్నర్లు, బ్యాటర్ల కొరత స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. దేశవాళీ క్రికెట్‌కు ప్రాధాన్యం తగ్గడం వల్లే ప్రతిభావంతులైన ఆటగాళ్లు వెలుగులోకి రావడం లేదని అభిప్రాయపడ్డారు. దేశవాళీ క్రికెట్‌ను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

అబ్బాస్‌కు అవకాశం ఇవ్వాల్సిందే

మొహమ్మద్‌ అబ్బాస్‌ లాంటి అనుభవజ్ఞుడైన బౌలర్‌ను జట్టులో కొనసాగించాలని కనేరియా సూచించారు. లార్డ్స్‌ టెస్టులో అబ్బాస్‌ ఐదు వికెట్లు తీసినప్పటికీ పాకిస్థాన్‌ ఓటమిని తప్పించుకోలేకపోయింది. అయినప్పటికీ కీలక సందర్భాల్లో అనుభవజ్ఞులైన ఆటగాళ్ల సేవలు జట్టుకు అవసరమని కనేరియా పేర్కొన్నారు. బ్యాటింగ్‌ విభాగంలోనూ పాకిస్థాన్‌ పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. ఇంగ్లండ్‌ పరిస్థితులకు అనుగుణంగా బ్యాటర్లు ఆడలేకపోతున్నారని విమర్శించారు. బాబర్‌ ఆజమ్‌, మహ్మద్‌ రిజ్వాన్‌ వంటి కీలక ఆటగాళ్ల ప్రదర్శనపైనా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు.

దేశవాళీ క్రికెట్‌పై ఫోకస్‌ చేయాలి

ప్రతిభావంతులైన ఆటగాళ్లను గుర్తించేందుకు సెలెక్టర్లు నేరుగా దేశవాళీ మ్యాచ్‌లకు వెళ్లాలని కనేరియా సూచించారు. దేశవాళీ క్రికెట్‌లో స్థిరంగా రాణించే ఆటగాళ్లకు అవకాశాలు కల్పించాలని అన్నారు. అలాగే జట్టుకు మంచి కోచ్‌ను నియమించి కనీసం ఏడాది పాటు తగినంత సమయం ఇవ్వాలని సూచించారు. తరచూ కోచ్‌లు, కెప్టెన్లు, ఆటగాళ్లను మార్చడం వల్ల జట్టులో స్థిరత్వం దెబ్బతింటోందన్నారు. పాకిస్థాన్‌ క్రికెట్‌లో జవాబుదారీతనం తప్పనిసరిగా ఉండాలని కనేరియా స్పష్టం చేశారు. ప్రతిభ ఆధారంగానే ఎంపికలు జరగాలని, దేశవాళీ క్రికెట్‌కు మళ్లీ ప్రాధాన్యం కల్పించాలని సూచించారు. ఇంగ్లండ్‌తో మూడో టెస్టుకు ముందే పాకిస్థాన్‌ భారీ మార్పులు చేసింది. కొత్త ఆటగాళ్లతో పాటు కొత్త కోచింగ్‌ సిబ్బందితో బరిలోకి దిగనున్న నేపథ్యంలో ఆ జట్టు ప్రదర్శనపై ఆసక్తి నెలకొంది.

Also Read : మమతా బెనర్జీ మేన కోడలు ఆత్మహత్య.. షాక్‌లో దీదీ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>