కలం, ఖమ్మం బ్యూరో: కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలపై రాజీలేని పోరాటానికి సీపీఐ సమర భేరి మోగించిందని భద్రాద్రి కొత్తగూడెం పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్.కే. సాబీర్ పాషా (SK Sabir Pasha) స్పష్టం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిర్వహించనున్న భారీ ప్రజాచైతన్య బహిరంగ సభ పాలకులకు గట్టి హెచ్చరిక కానుందన్నారు. జిల్లా కేంద్రం నుంచి పార్టీ ప్రతినిధుల బృందంతో కలిసి సోమవారం ఆయన తరలివెళ్లారు. పాలకులు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తూ, సామాన్య ప్రజలు, కార్మికులు, రైతుల హక్కులను కాలరాస్తున్నారని సాబీర్ పాషా ధ్వజమెత్తారు.
నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, నిరుద్యోగం, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వంటి తీవ్ర సమస్యలపై ఢిల్లీ వేదికగా పోరుబాట పట్టనున్నట్లు వెల్లడించారు. జిల్లా నుంచి హాజరవుతున్న ప్రతినిధులు తిరిగొచ్చాక గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లి ప్రజలను చైతన్యపరుస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ మూడ్ గణేష్, జిల్లా నాయకులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

