కలం, వెబ్ డెస్క్ : జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ యువజన విభాగం ఆవిష్కరణకు రంగం సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 2న పిఠాపురం వేదికగా జనసేన యువజన విభాగాన్ని (Janasena Youth Wing) అధికారికంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉదయం 11 గంటలకు జనసైనికులు, వీర మహిళలు, పార్టీ నాయకుల సమక్షంలో యువజన విభాగం ఆవిష్కరణ కానుందని జనసేన పార్టీ అధికారిక ప్రకటన చేసింది.
పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ , రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) చీఫ్ గెస్టుగా హాజరు కానున్న ఈ కార్యక్రమంలో యువజన విభాగం (Janasena Youth Wing) లోగో, గీతాన్ని కూడా ఆవిష్కరించనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కేరళలో చికిత్స తీసుకుంటున్న నేపథ్యంలో ఆయన ఆన్లైన్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించింది. కార్యక్రమంలో భాగంగా యువజన విభాగం ఏర్పాటు ఉద్దేశం, దాని లక్ష్యాలు, యువతలో రాజకీయ చైతన్యం పెంపొందించడం తదితర అంశాలపై పార్టీ శ్రేణులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేస్తారని పేర్కొంది.
కాగా, ఏపీలోని 175 నియోజకవర్గాల్లో యువజన విభాగం నిర్మాణాన్ని పూర్తి చేయడానికి జనసేన పార్టీ నాయకత్వం దృష్టి సారించింది. నియోజకవర్గాలతో పాటు మండల, గ్రామస్థాయిలోనూ యువతను అనుసంధానం చేసే విధంగా కార్యాచరణ రూపొందించనున్నట్లు సమాచారం అందుతోంది.పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, సామాజిక సేవా కార్యక్రమాలు, యువతకు సంబంధించిన అంశాలపై అవగాహన కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయి కార్యక్రమాల్లో యువత భాగస్వామ్యం పెంచేలా యువజన విభాగం పనిచేయనున్నట్లు తెలుస్తోంది.
Also Read : కేఏ పాల్గా మారిపోయిన విజయసాయి రెడ్డి: బొత్స సత్యనారాయణ
Follow Us On: Youtube

